పర్వతారోహణలో ప్రమాదం.. అమెరికాలో భారత సంతతి ఇంజనీర్ మృతి
ABN , Publish Date - May 16 , 2025 | 04:29 AM
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన టెకీ విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు మరణించారు.

మరో ఇద్దరు స్నేహితులు కూడా..
న్యూయార్క్, మే 15: అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ క్యాస్కేడ్స్ పర్వతారోహణకు వెళ్లిన ఓ బృందం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన టెకీ విష్ణు ఇరిగిరెడ్డి సహా ముగ్గురు మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సియాటెల్లో నివసించే విష్ణు ఇరిగిరెడ్డి(48) టిమ్ గుయేన్, ఒలెక్సాండర్ మార్టినెంకో, ఆంటోన్ త్సెలిక్ అనే తన ముగ్గురు స్నేహితులతో కలిసి గత శనివారం క్యాస్కేడ్స్లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. దిగే క్రమంలో మంచు తుఫాను వంటి ప్రతికూల వాతావరణం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆ బృందం యాంకర్ పాయింట్ విఫలమై.. 200 అడుగుల లోతులో పడిపోయారు. వీరిలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన త్సెలిక్ దాదాపు 64 కి.మీ. ప్రయాణించి.. ప్రమాదంపై అధికారులకు తెలియజేశాడు. భారత్కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్లో టెక్, సాంస్కృతిక సమాజంలో ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్రేటర్ సియాటెల్ ఏరియాలోని టెక్ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. విష్ణు కొన్నేళ్లుగా పర్వతారోహణ పట్ల మక్కువ పెంచుకున్నారని స్నేహితులు, కుటుంబసభ్యులు తెలిపారు.