Share News

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

ABN , Publish Date - May 26 , 2025 | 04:04 AM

సరస్వతీ నది పుష్కరాలకు వెళుతున్న కుటుంబమొకటి.. పుష్కర స్నానం చేసి తిరిగొస్తున్న కుటుంబం మరొకటి! ఇరు కుటుంబాలు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 13 మంది గాయపడ్డారు.

Car Accident: పుష్కరాలకు వెళుతుండగా ప్రమాదం

  • 2 కార్లు ఢీకొని మహిళ మృతి.. 13 మందికి గాయాలు

కాటారం, మే 25 (ఆంధ్రజ్యోతి): సరస్వతీ నది పుష్కరాలకు వెళుతున్న కుటుంబమొకటి.. పుష్కర స్నానం చేసి తిరిగొస్తున్న కుటుంబం మరొకటి! ఇరు కుటుంబాలు ప్రయాణిస్తున్న కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 13 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలో 353(సీ) జాతీయ రహదారిపై కాటారం శివారులో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన గెల్లి లక్ష్మీనర్సింహారావు, లక్ష్మీప్రసన్న దంపతులు, వారి కుమార్తెలు ధనలక్ష్మి, నందిని, తేజస్వినితో కారులో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానం చేశారు. కాటారం మీదుగా మేడారం బయలుదేరారు.


మరోవైపు హైదరాబాద్‌ బాలాపూర్‌ క్రాస్‌ రోడ్డు త్రివేణి నగర్‌కు చెందిన సకోటే కిషన్‌లాల్‌, కాడికె దుర్గాజీతో పాటు వారి కుటుంబ సభ్యులు పుష్క ర స్నానం చేద్దామని కాళేశ్వరం వెళ్తున్నారు. కాటారం శివారులో అటవీ శాఖ చెక్‌పోస్ట్‌ వద్ద లక్ష్మీనర్సింహరావు కారు వేగంగా కిషన్‌లాల్‌ కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. కిషన్‌లాల్‌ కారు డోర్లు లోపలికి చొచ్చుకుపోవడంతో ఆ వాహనంలోని సకోటే లలిత (61) తీవ్రగాయాలతో మృతిచెందారు. అదే వాహనంలోని కిషన్‌లాల్‌, రాకేష్‌, సాయినంద, కాడికే దుర్గాజీ, పద్మ, సాయిప్రియ, రేణుక, నర్మద, డ్రైవర్‌ మల్లేష్‌ గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన మరో కారులోని లక్ష్మీనర్సింహారావు దంపతులు, వారి కుమార్తెలను ఆస్పత్రికి తరలించారు.

Updated Date - May 26 , 2025 | 04:04 AM