TPCC Executive Committee: నామినేటెడ్లకు పదవుల్లేవ్
ABN , Publish Date - May 14 , 2025 | 03:41 AM
టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకులు ఢిల్లీలో తుది చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కొత్త పదవి కావాలంటే రాజీనామా చేయాలన్న నిబంధన అమల్లోకి వస్తోంది.

పార్టీ పదవి కావాలంటే.. నామినేటెడ్ పోస్టుకు రాజీనామా తప్పదు
ఎక్కువ మందికి చాన్స్ ఇచ్చేందుకు కార్యవర్గం కూర్పులో టీపీసీసీ నిబంధన
సీనియర్ల కోసం సలహా కమిటీ ఏర్పాటు!
క్రమశిక్షణ, సంవిధాన్ బచావ్,
డీ-లిమిటేషన్ కమిటీలు సైతం
35 మంది ఉపాధ్యక్షులు,
75 మంది ప్రధాన కార్యదర్శులతో జంబోకార్యవర్గం!
నేడు ఖర్గేతో టీపీసీసీ చీఫ్ భేటీ
వారంలోపే టీపీసీసీ కొత్త కార్యవర్గం
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. కొత్త కార్యవర్గం కూర్పుపై అధిష్ఠానం పెద్దలతో తుది చర్చల కోసం టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో బుధవారంనాడు ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ సైతం పాల్గొంటారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపైన ఈ భేటీలో తుది చర్చను పూర్తిచేసి.. నిర్ణయాలను వెలువరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారంలోపే అధిష్ఠానం.. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై కొద్ది రోజులుగా సీఎం రేవంత్రెడ్డి, మహేశ్కుమార్గౌడ్, మీనాక్షీ నటరాజన్, ఇతర ముఖ్య నాయకులు పలు దఫాలు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, పార్టీ పదవుల్లో వీలైనంత ఎక్కువ మంది నాయకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని టీపీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయించారు. ఒకవేళ ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే.. వారు తమ నామినేటెడ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని నియమం పెట్టుకున్నారు. ఈ నియమానికి లోబడే టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై కసరత్తు జరిగింది. ఇటీవల భేటీ అయిన సీఎం, టీపీసీసీ చీఫ్.. కార్యవర్గంపై కూర్పుపై చర్చించి, ఆయా పదవులకు ప్రతిపాదిత పేర్ల జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాపైనే ఖర్గేతో భేటీలో తుది చర్చ ఉంటుందని సమాచారం.
జంబో కార్యవర్గం..!
వీలైనంత మంది నేతలకు అవకాశం కల్పించేందుకు.. జంబో కార్యవర్గాన్నే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియర్ నాయకులకు అవకాశం కల్పించేందుకు టీపీసీసీ రాజకీయ సలహా కమిటీనీ ఏర్పాటు చేయనున్నారు. క్రమశిక్షణా చర్యల అమలు, సంవిధాన్ బచావ్ కార్యక్రమం అమలు తదితర కమిటీలనూ ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గ పునర్విభజన అంశంపైన పని చేసేందుకూ ప్రత్యేకంగా టీపీసీసీ కమిటీని నియమించనున్నారు. కార్యవర్గంతో పాటుగా ఇలా పలు కమిటీల నియామకమూ చేపట్టి వీలైనంతమంది నేతలకు అవకాశం కల్పించనున్నారు.
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు
అధిష్ఠానంతో గతంలో జరిగిన చర్యల్లో రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడ, ముస్లిం మైనార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలన్న నిర్ణయం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయా సామాజికవర్గాల నుంచి ప్రతిపాదిత పేర్ల జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. రెడ్డి వర్గం నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ పేర్లను పరిశీలిస్తున్నారు. ఎస్టీ లంబాడా నుంచి ఎంపీ బలరాంనాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్ రేసులో ఉన్నారు. మైనార్టీల నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా, మైనార్టీ గురకులాల విద్యాసంస్థ వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ప్రీతం, బెల్లయ్యనాయక్ను, ఫహీమ్ ఖురేషీ, అజ్మతుల్లాలు ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతున్నారు. టీపీసీసీ పెట్టిన నియమం ప్రకారం వారిలో ఎవరికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి దక్కినా.. వారు తమ నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.
8 నెలలుగా కసరత్తు..!
టీపీసీసీకి చీఫ్గా మహేశ్కుమార్ బాధ్యతలు స్వీకరించి, 8 నెలలు గడిచినా.. ఆయన టీమ్ ఇంకా సిద్ధం కాలేదు. సీఎం రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నప్పటి కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతోంది. అధిష్ఠానం వద్ద పలు దఫాలుగా భేటీలు జరిగినా.. కొత్త కార్యవర్గం ఏర్పాటు మాత్రం జరగలేదు. దీపా మున్షీ దాస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్నప్పుడు కసరత్తు పూర్తయినా.. ఆమె స్థానంలో మీనాక్షీ రాకతో మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత పలు దఫాలుగా కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఎట్టకేలకు ప్రతిపాదిత జాబితాలను సిద్ధం చేసింది.