Share News

Indian Forest Service: ఐఎఫ్‌ఎస్‌ టాప్‌-50లో ముగ్గురు మనోళ్లు

ABN , Publish Date - May 21 , 2025 | 03:39 AM

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. చాడ నిఖిల్‌రెడ్డి, జి. ప్రశాంత్, చెరుకు అవినాశ్‌రెడ్డి టాప్ 50లో స్థానం పొందారు.

Indian Forest Service: ఐఎఫ్‌ఎస్‌ టాప్‌-50లో ముగ్గురు మనోళ్లు

  • చాడ నిఖిల్‌రెడ్డి 11వ ర్యాంకు, జి.ప్రశాంత్‌ 25వ ర్యాంక్‌

  • చెరుకు అవినాశ్‌రెడ్డికి 40వ ర్యాంకు

  • తుది ఫలితాలు ప్రకటించిన యూపీఎస్సీ

  • దేశవ్యాప్తంగా 143 మంది ఎంపిక.. వీరిలో 80 మంది

  • అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ గైడెన్స్‌ తీసుకున్న వారే

హైదరాబాద్‌/మిర్యాలగూడ అర్బన్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీ్‌స-2024లో తెలంగాణ అభ్యర్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా అడవుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఈ సర్వీస్‌ అధికారుల కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఫారెస్ట్‌ సర్వీస్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఎంపికయ్యారు. అందులో ముగ్గురు తెలంగాణవారు. ముగ్గురూ టాప్‌ 50లో నిలిచారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్‌రెడ్డికి 11వ ర్యాంకు, మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన జి.ప్రశాంత్‌ 25వ ర్యాంకు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన చెరుకు అవినాశ్‌రెడ్డి 40వ ర్యాంకు సాధించారు. ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికైన 143 మంది అభ్యర్థుల్లో.. తుది ఇంటర్వ్యూ కోసం అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్‌ బృందం మార్గదర్శకత్వం అందించిన వారు 80మంది ఉండటం గమనార్హం. సివిల్స్‌కు సిద్ధమయ్యే అభ్యర్థులకు తమ బృందం కొన్నేళ్లుగా మార్గదర్శకత్వం చేస్తోందని, కీలకమైన ఇంటర్వ్యూలో గట్టెక్కడంపై మెళకువలు అందిస్తున్నామని మహేశ్‌ భగవత్‌ పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన దేవానంద్‌ తెల్గోటే తొలి ప్రయత్నంలోనే ఫారెస్ట్‌ సర్వీస్‌ 112వ ర్యాంకు సాధించారు. 2020లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ సమయంలో కరోనా బారినపడి, మృత్యువు అంచుల వరకు వెళ్లిన దేవానంద్‌.. ఏడీజీ మహేశ్‌ భగవత్‌ సాయంతోనే హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.


ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో..

మాది వ్యవసాయ కుటుంబం. ఐఐటీ ముంబైలో బీటెక్‌ చేశాను. ప్రజలకు సేవ చేసేందుకు యూపీఎస్సీకి సిద్ధమయ్యాను. గతంలో ఏడాదిపాటు ఈపీఎఫ్‌లో పనిచేశాను. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌)లో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగంలో పనిచేస్తూనే ఫారెస్ట్‌ సర్వీస్‌ పరీక్షకు హాజరై ఎంపికయ్యాను.

- ప్రశాంత్‌, ఫారెస్ట్‌ సర్వీ్‌సలో 25వ ర్యాంకు

ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యం

మా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. 2018లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరా. కలెక్టర్‌ అయి ప్రజలకు సేవ చేయాలన్నది నా అంతిమ లక్ష్యం. అందుకోసం ఉద్యోగాన్ని వదిలేసి యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికవడం ఆత్వవిశ్వాసాన్ని పెంచింది. ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యం నెరవేర్చుకుంటాను.

- చాడ నిఖిల్‌రెడ్డి, ఫారెస్ట్‌ సర్వీ్‌సలో 25వ ర్యాంకు

Updated Date - May 21 , 2025 | 03:40 AM