Mancherial: ముగ్గురు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:24 AM
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన కారణంగా మంచిర్యాల, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలు విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో చెబుతున్నాయి

ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైనందుకే..
లక్షెట్టిపేట, భిక్కనూరు, మహదేవపూర్ రూరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత(17) ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామానికి చెందిన పూజ(17) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. మరో ఘటనలో.. భూపాలపల్లి జిలా పలిమెల మండల కేంద్రంలోని అప్పాజీపేటకు చెందిన జాడి సంజన(16) ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.