Chamala: 3 నెలల్లో రూ.29 వేల కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:26 AM
తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించామని, ఆ తర్వాత 3 నెలల్లో రూ.29వేల కోట్ల పెట్టుబడులు సాధించామని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి
హైదరాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పత్తి సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించామని, ఆ తర్వాత 3 నెలల్లో రూ.29వేల కోట్ల పెట్టుబడులు సాధించామని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్రెడ్డి ‘క్లైమేట్ యాక్షన్ వీక్’లో భాగంగా బుధవారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడారు.
సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో 3,279 మెగావాట్ల విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, జయశంకర్ భూపాలపల్లిలో 1,650 మెగావాట్ల తేలియాడే సోలార్ ప్రాజెక్టు తదితర ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. వీటి ద్వారా స్థానికులకు 19 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎస్హెచ్జీల ద్వారా 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ తయారీకి తెలంగాణప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని చెప్పారు.