బెజుగామలో జైన తీర్థంకర శిల్పాలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:21 AM
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిఽధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు.

గుర్తించిన చారిత్రక పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్
గజ్వేల్, జూన్ 4(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. మొదటి శిల్పం రాయచెరువులో ఉందని, ధ్యాన ముద్రలో ఉన్న ఈ మహావీరుని తలపై ఊష్ణీషం చెక్కి ఉందని తెలిపారు. ఈ శిల్పం 8, 9వ శతాబ్దాలకు చెందిన శైలిలో బ్లాక్ కోరైట్ రాయి మీద చెక్కి ఉందన్నారు. రెండో విగ్రహం గ్రామంలోని హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో కూరుకుపోయి విరిగి కనిపిస్తుందన్నారు.
ఈ శిల్పం గుండ్రని ముఖంతో, చిన్న ఉష్ణీషంతో 10, 11వ శాతాబ్దాలకు చెందిన శైలిలో చెక్కారని తెలిపారు. బెజుగామలో 11వ శతాబ్దానికి(1072కు) చెందిన కళ్యాణి చాళుక్య పాలకుడు భువనైకమల్ల దేవర కాలంలో పంప పెర్మానడిగల్ బెజగాం దేవునికి చేసిన దాన శాసనం ఒకటి, అదే కాలానికి చెందిన మరో శానస శకలం ఉన్నాయన్నారు. ఈ శాసనంలో పేర్కొన్న బెజుగాం దేవుడు జైన తీర్థంకరుడే అయి ఉండొచ్చని తెలిపారు.