Banswada Congress: బాన్సువాడ కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:11 AM
బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

ఏనుగు రవీందర్రెడ్డి-పోచారం వర్గీయుల తోపులాట
నిజామాబాద్, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఆదివారం బాన్సువాడలో పర్యటనలో ఉండగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్సరెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్రెడ్డి వర్గీయులు తోపులాటకు దిగారు. చందూర్ మండల కేంద్రంలో సీతక్క పాల్గొన్న కార్యక్రమానికి ఏనుగు రవీందర్రెడ్డిని రాకుండా పోచారం వర్గీయులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ నాయకుడిని ప్రభుత్వ కార్యక్రమాలకు రాకుండా అడ్డుపడటం సరికాదని ఏనుగు వర్గీయులు భగ్గుమన్నారు. పోలీసులు ఇరువర్గాలను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివా్సరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఏనుగు వర్గీయులతో పొసగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వర్గ పోరుతో నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.