తిరిగొస్తాం.. సాయం చేయండి
ABN , Publish Date - May 16 , 2025 | 03:58 AM
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఎడారిలో తల్లిబిడ్డల వీసా గోడు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి, మే 15: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని దుబాయ్కి వెళ్లిన వలస జీవుల కష్టాలు తీరడం లేదు. ఏజెంట్ చేతిలో మోసపోయి స్వదేశానికి తిరిగిరాకపోవడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించడం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా వీసా నియమ నిబంధనలు తెలియకుండా తన నెల రోజుల పసికందుతో ఒక తెలుగు మాతృమూర్తి దుబాయ్లో ఇరుక్కుని సాయం కోసం ఎదురుచూస్తోంది. హైద్రాబాద్లోని రాజేంద్రనగర్ కు చెందిన రాఘల సుధారాణి సౌదీ అరేబియాలో నర్సుగా పని చేస్తుండగా ఆమె భర్త కుటుంబం భారత్లో ఉంటున్నారు. కొద్ది కాలం క్రితం స్వదేశానికి వెళ్ళి తిరిగి వచ్చిన ఆమె గర్భం దాల్చింది. జూన్లో ప్రసవించాల్సి ఉంది. వీసా పరమైన సమస్యలను ముందుగా ఉహించిన సుధారాణి తాను ప్రసవ సమయానికి స్వదేశానికి వెళ్ళడానికి ప్రయత్నించింది.
కానీ ఈ సమయంలో ప్రయాణం చేయడం ప్రమాదకరమని వైద్యులు అనుమతి నిరాకరించడంతో సుధారాణి అక్కడే బిడ్డకు జన్మించింది. పాపకు సౌదీ అరేబియా ప్రభుత్వం జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, భారతీయ ఎంబసీ జారీ చేసిన పాస్ పోర్టును తీసుకుని స్వదేశానికి బయలుదేరింది. కానీ రియాద్ విమానశ్రాయంలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలో సుధారాణి వీసాలో బిడ్డ పేరు లేకపోవడంతో అధికారులు ప్రయాణానికి అనుమతించలేదు. పరిస్థితిని తెలుసుకున్న ఓ మలయాళీ సుధారాణిని భారతీయ కాన్సులేటుకు చేర్చాడు. కాన్సులేటు సిబ్బంది వెంటనే విషయాన్ని సౌదీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పుట్టిన బిడ్డ పేరును ఇఖామా(వీసా)లో చేర్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే శిశువు తన తల్లితో కలిసి స్వదేశానికి పంపడానికి అనుమతిస్తామని వారు తెలిపారు. తల్లిబిడ్డలకు తెలుగు ప్రవాసీ సంఘం అధ్యకుడు మల్లేషన్ విశ్వనాథం తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. వీసా ప్రక్రియ పూర్తి కావాల్సి వచ్చిందని ఒకటి, రెండు రోజుల్లో వారిని స్వదేశానికి పంపిస్తామని మల్లేషన్ తెలిపారు.