Share News

TG Investments: రూ.2,125 కోట్లు

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:58 AM

తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్‌, టారనిస్‌ క్యాపిటల్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.

TG Investments: రూ.2,125 కోట్లు

  • రాష్ట్రంలోని 5 స్థానిక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనున్న యూఏఈ సంస్థలు శైవ గ్రూప్‌, టారనిస్‌ క్యాపిటల్‌

  • తెలంగాణ యువతకు 5,020 ఉద్యోగావకాశాలు

  • మూడేళ్లలో మరో రూ.24 వేల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్‌బాబు

  • హైదరాబాద్‌లో దైచీ లైఫ్‌.. జపాన్‌ వెలుపల ఇదే తొలి కేంద్రం

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్‌, టారనిస్‌ క్యాపిటల్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన ఐదు స్థానిక కంపెనీలతో ఈ రెండు సంస్థలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలోని 5,020 మంది యువతకు కొత్తగా ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి.. యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడారు. ‘‘18 నెలల్లో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాదిన్నర కాలంలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఫలితంగా ప్రైవేటు రంగంలో లక్ష మందికి పైగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించాయి. ఈ ప్రయాణంలో ఈరోజు మరో గొప్ప అడుగు ముందుకేశాం’’ అని అన్నారు. శైవ గ్రూప్‌, టారనిస్‌ క్యాపిటల్‌ సంయుక్తంగా రివలేషన్స్‌ బయోటెక్‌ లో రూ.1,360 కోట్లు, మనాకిన్‌ బయోలో రూ.340 కోట్లు, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్‌లో రూ.80 కోట్లు, ఎగ్జిగెంట్‌ డ్రిల్లింగ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.90 కోట్లు, యంత్ర టెక్‌ కంట్రోల్స్‌లో రూ.255 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, రాబోయే మూడేళ్లలో బయోటెక్‌, ఏఐ, డేటా సెంటర్‌, డిఫెన్స్‌, ఎనర్జీ, ఫిన్‌ టెక్‌, పబ్లిక్‌ సెక్టార్స్‌ తదితర రంగాల్లో మరో రూ.24 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ రెండు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయని పేర్కొన్నారు.


ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ కొందరు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. తాము తీసుకొస్తున్న పెట్టుబుడులు, కల్పిస్తున్న ఉద్యోగాలు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఒక రాష్ట్రం కాదు.. అవకాశాల గని. ప్రతిభకు కేరాఫ్‌ అడ్రస్‌. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు కేంద్రం. అంతర్జాతీయ భాగస్వామ్యాలకు గమ్యస్థానం. మీ ఎదుగుదలే మా రాష్ట్రాభివృద్ధి అని నమ్మే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. అందుకే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి’’ అని మంత్రి అన్నారు. ఏఐ సిటీ గురించి దేశ విదేశాలకు చెందిన మేధావులతో చర్చించామని, దానికి సంబంధించిన రూపకల్పన, సాంకేతిక అంశాల పరిశోధన తుది దశకు చేరుకుందని తెలిపారు. పీపీపీ విధానంలో ఏఐ సిటీ నిర్మాణం చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. దీనికి 800 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని, ఐదు నెలల లోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శైవ గ్రూప్‌ చైర్మన్‌, సీఈవో అమిత్‌ జగన్నాథ్‌ వర్మ, టారనిస్‌ క్యాపిటల్‌ సీఈవో నికోలస్‌ ఎస్‌.బింగ్‌ హామ్‌, రివలేషన్స్‌ బయోటెక్‌ ఎండీ రవిచంద్ర బీరం, మనాకిన్‌ బయో డైరెక్టర్‌ జశ్వంత్‌ ప్రణవ్‌ యతిరాజాం, స్వబోధ ఇన్ఫినిటీ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైజర్స్‌ సీఈవో సంకర్ష్‌ చందా, ఎగ్జిగెంట్‌ డ్రిల్లింగ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ పాండురంగారావు తమ్మినేని, యంత్ర టెక్‌ కంట్రోల్స్‌ సీఈవో సమీర్‌కాంత్‌, రాయ్‌ డిన్‌రోచ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 07:03 AM