హైదరాబాద్లో క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధి
ABN , Publish Date - Apr 14 , 2025 | 03:45 AM
రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కు చెందిన ఫ్రంటియర్ టెక్ హబ్ (ఎఫ్టీహెచ్)తో కలిసి హైదరాబాద్లో క్వాంటమ్ సాంకేతికతకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఓ వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.

నేడు క్వాంటమ్ ఫ్రంటియర్ టెక్ చార్టర్ ప్రకటన
భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలకు కేంద్రంగా మార్చుతాం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కు చెందిన ఫ్రంటియర్ టెక్ హబ్ (ఎఫ్టీహెచ్)తో కలిసి హైదరాబాద్లో క్వాంటమ్ సాంకేతికతకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను వేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఓ వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. సోమవారం (14న) ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నీతి ఆయోగ్ ఎఫ్టీహెచ్తో కలిసి క్వాంటమ్ ఫ్రంటియర్ టెక్ చార్టర్ను ప్రకటించనుంది. ఈ చార్టర్ ద్వారా రాష్ట్రాన్ని దేశంలో ప్రముఖ క్వాంటమ్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పనిచేయనుంది.
ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్య, ఆర్థిక రంగం, మెటీరియల్ సైన్స్, లాజిస్టిక్ వంటి కీలక రంగాల్లో ఉన్న సవాళ్లకు పరిష్కార మార్గాలను అందించనుంది. కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాదంతా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రాష్ట్రాన్ని భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలకు కేంద్రంగా మార్చే దిశగా పెద్ద ముందడుగు వేయబోతున్నామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించి, వాటిని ప్రజా శ్రేయస్సుకు సాధనాలుగా మార్చడం ద్వారా తెలంగాణను ప్రపంచ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థగా మార్చుతామని చెప్పారు. హైదరాబాద్లో క్వాంటమ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను సర్కారు ప్రోత్సహిస్తుందన్నారు.