Telangana TDP Youth: యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత పార్టీ ఘనతే
ABN , Publish Date - May 28 , 2025 | 07:37 AM
తెలంగాణ టీడీపీ కడప మహానాడులో యువతకు ఉపాధి, మహిళా సాధికారత వంటి నాలుగు కీలక తీర్మానాలు తీసుకుంది. రాష్ట్రం నుంచి 1500 మంది ప్రతినిధులు ఈ మహానాడుకు హాజరయ్యారు.

మహానాడులో తెలంగాణ టీడీపీ తీర్మానాలు
రాష్ట్రం నుంచి 1500మంది ప్రతినిధుల హాజరు
హైదరాబాద్, మే 27 (ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పన, మహిళా సాధికారత టీడీపీ ఘనతే అని తెలంగాణ టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. కడపలో జరుగుతున్న మహానాడులో తెలంగాణ టీడీపీ నాలుగు తీర్మానాలు ప్రతిపాదించింది. యువ త, మహిళ, వ్యవసాయ రంగాలతో పాటు సంక్షేమ రంగం-తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై మరో తీర్మా నం ప్రతిపాదించింది. ఆయా రంగాలకు సంబంధించి ఉమ్మడి ఏపీలో టీడీపీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు-వాటితో కలిగిన ప్రయోజనాలను ప్రస్తావించింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం ఇటీవల సమావేశమై సంస్థాగత బలోపేతంపై మరో ప్రతిపాదన కేంద్ర పార్టీకి నివేదించింది. దీనిని పార్టీ ఉమ్మడి తీర్మానంలో చేర్చారని టీడీపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ నుంచి 1,500 మంది ప్రతినిధులు మహానాడుకు హాజరవుతున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, జాతీయ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న, పొలిట్ బ్యూరో సభ్యులు అరవింద్గౌడ్, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు నందమూరి సుహాసిని, మాజీ ఎమ్మెల్యేలు కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్యతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులు కూడా కడపకు తరలివెళ్లారు.