Share News

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

ABN , Publish Date - May 14 , 2025 | 03:06 AM

అమెరికాలో అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చదువుతున్న నల్లగొండ యువతి ప్రియాంక అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో వైద్యం ఆలస్యం అయి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది.

Nalgonda Student: అమెరికాలో నల్లగొండ విద్యార్థిని మృతి

  • అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చదివి ఉద్యోగ వేటలో నిమగ్నం

  • అస్వస్థతకు గురైన ప్రియాంక

  • బీమా లేక వైద్యం ఆలస్యం

  • బ్రెయిన్‌డెడ్‌తో మృత్యువాత

కట్టంగూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఓ యువతి.. ఉద్యోగ కల సాకారమయ్యే వేళ అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో కూతురి భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్‌రెడ్డి, శోభారాణి దంపతులకు కుమారుడు, కుమార్తె ప్రియాంక(26) ఉన్నారు. ప్రియాంక ఢిల్లీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేసి, 2023 జనవరిలో అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరింది. పీజీ పూర్తి చేసి, పార్ట్‌ టైం వర్క్‌ చేస్తూ ఉద్యోగయత్నాల్లో ఉంది. ఈ నెల 4న తండ్రి వెంకట్‌రెడ్డి ప్రియాంకకు ఫోన్‌ చేయగా, దంత సంబంధిత అనారోగ్యంతో 3 రోజులుగా అస్వస్థతగా ఉందని తెలిపింది. ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో చికిత్స కోసం ఎక్కువ వ్యయం అయిందని, ఇన్సూరెన్స్‌కు దరఖాస్తు చేశానని పేర్కొంది. మరుసటి రోజే ఇన్సూరెన్స్‌ అప్రూవల్‌ కాపీని తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అనుకోకుండా ఆసుపత్రికి వచ్చానని, తర్వాత మళ్లీ వస్తానని ఆమె వెళ్లిపోయింది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 6న స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయింది. స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సమీపంలోని సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించిన వైద్యులు ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయిందని నిర్ధారించారు. వెంటిలేటర్‌ అమర్చి ఒక రోజు వైద్యం అందించారు. తల్లిదండ్రులు, ప్రియాంక బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం వెంటిలేటర్‌ తీసివేయడంతో ప్రియాంక ఈ నెల 8న మృతిచెందింది. బుధవారం ఆమె మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుంది.

Updated Date - May 14 , 2025 | 03:07 AM