Share News

Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు

ABN , Publish Date - May 15 , 2025 | 03:28 AM

సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.

Saraswati Pushkaralu: నేటి నుంచి సరస్వతి పుష్కరాలు

  • కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద విస్తృత ఏర్పాట్లు.. నేడు పుష్కర్‌ ఘాట్‌కు సీఎం

భూపాలపల్లి, హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్రంలో సర్వం సిద్ధమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో గురువారం తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి.. పుష్కరాలకు అంకురార్పణ చేయనున్నారు. గురువారం ఉదయం 5.44 గంటలకు ప్రారంభమయ్యే పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు కొనసాగుతాయి. సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం వస్తారు. త్రివేణి సంగమం వద్ద సిద్ధం చేసిన సరస్వతి ఘాట్‌ను ప్రారంభిస్తారు. అలాగే, సరస్వతి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం నదిలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు సరస్వతి ఘాట్‌ వద్ద జరిగే సరస్వతి నదీ హారతి కార్యక్రమంలో పాల్గొంటారు.


అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం, కాటారం మండలం ధన్వాడకు రోడ్డు మార్గంలో వెళ్లి రాత్రి భోజనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. కాగా, పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రం నలుమూలల రోజుకు 40వేల నుంచి 50వేల మంది భక్తులు పుష్కరాలకు వస్తారని అధికారుల అంచనా. భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్‌లలో అధికారులు వసతులు సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపనుంది. 1700 మంది పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, త్రివేణి సంగమం వద్ద ప్రతిరోజు ఉదయం 8.30 నుంచి 11గంటల వరకు యాగాలు జరుగుతాయి. సాయంత్రం 6.45 నుంచి 7.35 వరకు సరస్వతి ఘాట్‌లో సరస్వతి నవరత్న మాలహరతి నిర్వహిస్తారు. కాళేశ్వరం యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా వివిధ సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:34 AM