Bhatti Vikramarka: బీమాతో కార్మికుల కుటుంబాలకు భరోసా: భట్టి
ABN , Publish Date - May 27 , 2025 | 04:03 AM
రాష్ట్రంలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాను అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

మృతి చెందిన విద్యుత్ కార్మికుడి కుటుంబానికి కోటి చెక్కు
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమాను అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉత్తర డిస్కమ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కును సోమవారం ప్రజాభవన్లో భట్టి అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుడి కుటుంబానికి కారుణ్య నియామక ఉత్తర్వులు కూడా అందించారు.
విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా అందించడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. తొలుత సింగరేణిలో రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, ఆ తర్వాత విద్యుత్ సంస్థల్లోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రమాద బీమా పథకం కార్మికుల కుటుంబాల్లో కొత్త భరోసాను నింపుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డిని భట్టి అభినందించారు.