Thummala Nageshwar Rao: రాష్ట్రంలో పంటల బీమా పథకం
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:02 AM
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల బీమాకు వర్తించగల పంటలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు

ఏయే పంటలకు వర్తింపజేయాలో ప్రతిపాదనలు రూపొందించండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఏయే పంటలకు బీమా వర్తింపజేయాలనే అంశంపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సచివాలయంలో బుధవారం వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. వానాకాలంలో రైతులు సుమారు 128 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తారని, ప్రకృతి విపత్తులతో నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించినట్టు ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులు మంత్రికి తెలిపారు. దిగుబడి ఆధారిత బీమా పథకంలో వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు తదితర పంటలు.. వాతావరణ ఆధారిత బీమా పథకంలో పత్తి, మిరప, మామిడి, పామాయిల్, టమాట, బత్తాయి పంటలకు బీమా వర్తింపజేసే అవకాశం ఉన్న నేపథ్యంలో... రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకానికి రూపకల్పన చేయాలని తుమ్మల ఆదేశించారు.