Gurukula Schools: గురుకులాల్లో నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్కు టెండర్లు
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:52 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్ కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు నోటిఫికేషన్ ఇటీవల జారీ అవ్వగా ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

హైదరాబాద్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన నిత్యావసరాల సరఫరా, క్యాటరింగ్ కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఇందుకు నోటిఫికేషన్ ఇటీవల జారీ అవ్వగా ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 23న టెండర్ల కేటాయింపు చేసి 28న వర్క్ ఆర్డర్లు ఇస్తారు. వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు సెప్టెంబరు 1 నుంచి సేవలను అందించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియ జిల్లా కొనుగోలు కమిటీ(డీపీసీ)ల ఆధ్వర్యంలో జరగనుంది. కాగా, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి జిల్లా, మండల స్థాయిల్లో మూడు విభాగాలుగా టెండర్లు నిర్వహించేలా విభజించారు. టెండర్లలో పాల్గొనే వారు ఆసక్తి ఉన్న ప్రతి విభాగానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
అయితే, కాంట్రాక్టు ఏజెన్సీలు ఒకే టెండర్ ఫారమ్ ద్వారా వేర్వేరు విద్యాసంస్థలకు సేవలందించడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ విధానం మండల మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలు, స్థానిక వ్యాపారులకు విస్తృత అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఆహార పదార్థాల సేకరణ, నాణ్యతకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల్లో ఒకే విధమైన వ్యవస్థ ఉండేలా చూసుకునేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News