Share News

Uttam: గోదావరి-బనకచర్లను అడ్డుకోండి

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:05 AM

నికర జలాలు లేని ప్రాజెక్టుకు డీపీఆర్‌ దాఖలు చేయాలని ఎలా కోరతారని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది.

Uttam: గోదావరి-బనకచర్లను అడ్డుకోండి

ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను తిరస్కరించండి

  • డీపీఆర్‌ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా అడ్డుకోండి

  • నికర జలాల్లేని ప్రాజెక్టుకు డీపీఆర్‌ ఇవ్వాలని ఎలా కోరతారు

  • ఏపీ విషయంలో కేంద్రం తీరుపై అభ్యంతరం

  • కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తమ్‌ ఘాటు లేఖ

  • హరీశ్‌ ఆరోపణలు నిరాధారమన్న మంత్రి

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నికర జలాలు లేని ప్రాజెక్టుకు డీపీఆర్‌ దాఖలు చేయాలని ఎలా కోరతారని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం నిలదీసింది. గోదావరి-బనకచర్ల అనుసంధానంపై కేంద్ర వైఖరిని తప్పుబడుతూ ఈనెల 13న జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ‘‘గత నెల మే 28న నేను రాసిన లేఖకు మీరు స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014, బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారమేగోదావరి-బనకచర్ల అనుసంధానం విషయంలో వ్యవహరిస్తామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ పథకానికి సంబంధించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్ర జలవనరుల సంఘాని(సీడబ్ల్యూసీ)కి దాఖలు చేసింది, ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ సంయుక్త కమిషనర్‌ అమిత్‌ కుమార్‌ ఝా కూడా హాజరయ్యారు. గోదావరి-బనకచర్ల పీఎ్‌ఫఆర్‌ను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి డీపీఆర్‌ను సమర్పించాలని ఏపీని కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కోరడం తీవ్ర అభ్యంతరకరం. ఒక పథకం డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయాలంటే తొలుత ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)కు ఆ విభాగం క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.


అలాకాకుండా గోదావరి-బనకచర్ల అనుసంధానం డీపీఆర్‌ దాఖలు చేయాలని ఏపీని ఏ విధంగా కోరతారు..? పీఎ్‌ఫఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించిందా..? తెలంగాణ తరఫున గోదావరి-బనకచర్ల అనుసంఽధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా డీపీఆర్‌కు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా, 1980 నాటి బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఎటువంటి నీటి కేటాయింపులు లేవు. నికర జలాల కేటాయింపుల్లేకుండా దాఖలు చేసే పీఎ్‌ఫఆర్‌ను సీడబ్ల్యూసీ తిరస్కరిస్తుంది తప్ప డీపీఆర్‌ దాఖలు చేయాలని ఎప్పుడూ కోరదు. కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ సంయుక్త కమిషనర్‌ సమక్షంలో గోదావరి-బనకచర్ల డీపీఆర్‌ను దాఖలు చేయాలని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలు సాంకేతికంగా పీఎ్‌ఫఆర్‌కు ఆమోదం తెలిపినట్లుగా భావించాల్సి ఉంటుంది.


కృష్ణా, గోదావరిలో ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా తొలుత సీడబ్ల్యూసీలో డీపీఆర్‌ దాఖలు చేసి, దానికి సీడబ్ల్యూసీలోని అన్ని విభాగాలు క్లియరెన్స్‌ ఇచ్చాక.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు డీపీఆర్‌ను పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి అనంతరం ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుంది. ఏపీ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధానం తెలంగాణ ప్రజల న్యాయమైన నీటి హక్కును ఉల్లంఘించడమే కాకుండా న్యాయమైన నీటి వాటాపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. తెలంగాణ హక్కులను హరించే ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు తెలపడం సహజ న్యాయసూత్రానికి విరుద్ధం. అంతర్రాష్ట్ర నదీ జలాల్లో సమాన వాటాకు విరుద్ధం. ఈ అంశాల దృష్ట్యా పీఎ్‌ఫఆర్‌ను తక్షణమే తిరస్కరించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలి. ఈ పథకం డీపీఆర్‌ను కూడా సీడబ్ల్యూసీలో దాఖలు చేయకుండా నిలువరించాలి. టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వెళుతున్న ఏపీని కట్టడి చేయాలి’’ అని ఉత్తమ్‌ లేఖలో పేర్కొన్నారు. కాగా, గోదావరి-బనకచర్ల అనుసంధానానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఉత్తమ్‌ లేఖలు రాశారు.


హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారం

తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించే ఏ ప్రాజెక్టును కూడా చేపట్టడానికి అంగీకరించబోమని ఉత్తమ్‌ తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపణలు నిరాధారమని, నదీ జలాలపై తెలంగాణ హక్కుకు అన్యాయం చేసిందే బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. రాష్ట్ర అవతరణ అనంతరం ఉమ్మడి ఏపీకి కృష్ణాలో 811 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా.. అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని గుర్తు చేశారు. ఆ ద్రోహమే నీటి సంక్షోభానికి పునాది వేసిందన్నారు. శ్రీశైలం నుంచి మల్యాల, ముచ్చుమర్రి వద్ద నుంచి నీటి తరలింపును బీఆర్‌ఎస్‌ అడ్డుకోలేదని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్టుకు ఏపీ టెండర్లు పిలిచిన తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్వహించేలా జాగ్రత్త పడి ఏపీకి బీఆర్‌ఎస్‌ మేలు చేసిందన్నారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య జరిగిన చీకటి ఒప్పందం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే పనులు జరుగుతున్నాయని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:05 AM