Tourism Growth: ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ
ABN , Publish Date - May 05 , 2025 | 03:45 AM
మిస్ వరల్డ్ 2023 పోటీదారులకు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయడానికి ప్రభుత్వ పథకాలు. ఇది విదేశీ పర్యాటకులను ఆకర్షించి, రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుంది

‘మిస్ వరల్డ్’ పోటీదారులకు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను పరిచయం చేసేలా షెడ్యూల్
విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక
పర్యాటక రంగ వృద్ధితో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఊతం
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన తెలంగాణను ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతోపాటు పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు మిస్వరల్డ్ పోటీలను వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. హైదరాబాద్ వేదికగా ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీల కోసం ప్రపంచ వ్యాప్తంగా 120దేశాల సుందరీమణులు, వేలాది మంది ప్రతినిధులు రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే. వీరికి రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను పరిచయం చేయడం ద్వారా పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ఇందులో భాగంగా హైదరాబాద్లోనేఇ చార్మినార్, లాడ్బజార్ చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్లోని వేయి స్తంభాల ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, రామప్ప ఆలయం, నల్లగొండలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పోచంపల్లి వస్త్ర పరిశ్రమ, మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి వృక్షం, చేవెళ్ల సమీపంలోని ఎక్స్పీరియం పార్కు వంటి పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ పోటీ దారులు సందర్శించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. 2024లో తెలంగాణను 1,55,113మంది విదేశీ పర్యాటకులు సందర్శించగా..ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ మందిని ఆక్షరించడమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడంతో పాటు ప్రపంచ పటంలో మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్గా రాష్ట్రాన్ని పరిచయం చేయాలని సర్కారు యోచిస్తోంది. పర్యాటకరంగ వృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది.