Sridhar Babu: ఏడాదిలో ‘టాస్క్’ ద్వారా 4,100 ఉద్యోగాలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:27 AM
రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 4,100 మంది ఉద్యోగాలు సాధించడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) కీలక పాత్ర పోషించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

గరిష్ఠ వార్షిక ప్యాకేజీ రూ.11 లక్షలు, కనిష్టం రూ.2.4 లక్షలు
1,37,677 మంది విద్యార్థులు, 2,791 మంది ఫ్యాకల్టీకి శిక్షణ
వికలాంగులు ఎదిగేందుకు టాటా ట్రస్ట్తో ఒప్పందం: శ్రీధర్బాబు
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 4,100 మంది ఉద్యోగాలు సాధించడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) కీలక పాత్ర పోషించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 6 వేలకు తగ్గొద్దని లక్ష్యాన్ని నిర్దేశించారు. శుక్రవారం సచివాలయంలో ‘టాస్క్’ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్ గణనీయమైన పురోగతి సాధించిందని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణను అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది టాస్క్ సంస్థ రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2,791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక, నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించింద ని శ్రీధర్ బాబు వెల్లడించారు. వెరిస్క్ అనలైటిక్స్ అనే అమెరికన్ కంపెనీ ఏడాదికి రూ.11 లక్షల ప్యాకేజీతో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకోగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్(యూబీఎస్) రూ.6 లక్షల వార్షిక ప్యాకేజీతో 63 మందిని నియమించుకుందని తెలిపారు. హ్యుండాయ్ మోబిస్ సంస్థ టాస్క్ ద్వారా 42మందికి శిక్షణ అందిం చి ఉద్యోగాల్లో నియమించుకుందని వివరించారు. ఉద్యోగాలు సాధించిన మొత్తం 4100 మందిలో, కనీస వార్షిక ప్యాకేజీ రూ.2.4 లక్షలుగా ఉందని శ్రీధర్బాబు పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి సదస్సుకు హాజరైన టాస్క్ విద్యార్థులు
వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్ ఫౌండేషన్ తెలంగాణలో ఏర్పాటు చేసిన గ్రిన్ స్కిల్స్ అకాడమీ ద్వారా మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు శిక్షణ పొందారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఐక్యరాజ్య సమితి ఇటీవల న్యూయార్క్లో నిర్వహించిన గ్లోబల్ సదస్సుకు హాజరైన నలుగురు విద్యార్థులను ఆయన ప్రశంసించారు. అంగ వైకల్యం ఉన్న యువతకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా టాటా ట్రస్ట్తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించారు.