Tandur Registrations: అక్రమ రిజిస్ట్రేషన్లపై పొంగులేటి ఆగ్రహం
ABN , Publish Date - May 27 , 2025 | 04:01 AM
తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు బాధ్యులైన అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్ద హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారని తెలిసింది.

హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాలుగు రోజుల వ్యవధిలో 300 రిజిస్ట్రేషన్లు జరిగాయని, అందుకు బాధ్యులైన అధికారులంతా పూర్తి నివేదికతో మంగళవారం సాయంత్రం తన వద్ద హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారని తెలిసింది. తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 10 రిజిస్ట్రేషన్లు కూడా జరగవని, అలాంటి చోట నాలుగు రోజుల్లో 300 రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనధికారిక డాక్యుమెంట్లను నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ ఎలా చేశారని ప్రశ్నించినట్లు తెలిసింది. దీని వెనుకాల రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా మంత్రి ఆరా తీసినట్లు సమాచారం. ఈనెల 12 నుంచి 18 మధ్యలో తాండూరుకు చెందిన అధికార పార్టీ నేత ప్రమేయంతోనే రిజిస్ట్రేషన్లు జరిగాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించడం రిజిస్ట్రేషన్ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆహ్వానం
‘‘యాటను కోస్తాం.. జొన్న రొట్టెలు, సర్కారు అందించే సన్నబియ్యంతో భోజనం పెడతాం. మా గృహ ప్రవేశానికి ముఖ్యమంత్రి రేవంత్ను తీసుకుని రండి సార్’’ అంటూ పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదని, త్వరలో నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశం చేసుకుంటామని తెలిపారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.