Share News

MP Kiran Kumar Reddy: బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:03 AM

తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన

MP Kiran Kumar Reddy: బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు

సుప్రీం తీర్పు బీఆర్‌ఎస్‌ నేతలకు చెంపపెట్టు.. అనర్హతపై నిర్ణయాధికారం స్పీకర్‌దేనని చెప్పింది

  • నిర్ణయాధికారం స్పీకర్‌దేనని సుప్రీం చెప్పింది

  • కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

  • ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీశ్‌రావు, కేటీఆర్‌కు లేదు: ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జులై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌ పార్టీకి చెంపపెట్టని అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం అనర్హత వేటు వేస్తుందని బీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలులు కన్నారని, వారి కలలన్నీ కల్లలయ్యాయని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రమే నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. స్పీకర్‌ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందేనని చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందన్నారు. ఉప ఎన్నికలొస్తే సిద్ధంగా ఉన్నామని, తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌ నేతలకు చెంపపెట్టు అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎల్పీ కార్యాలయంలో మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై హరీశ్‌, కేటీఆర్‌లకు మాట్లాడే అర్హత లేదన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్‌ నాయకులు సంబరపడుతున్నారని మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివేకానందగౌడ్‌ 2014లో టీడీపీ తరఫున గెలిచి, బీఆర్‌ఎ్‌సలో చేరారని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫిరాయింపులపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు.

అనర్హతపై స్పీకర్‌కు సుప్రీం సూచనే: అద్దంకి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచన మాత్రమే చేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. న్యాయస్థానాలు స్పీకర్‌ అధికారాలను ప్రశ్నించలేవని చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి రాని కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్‌ను కోరుతున్నట్టు దయాకర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. చట్టంలోని లొసుగుల కారణంగా అది సాధ్యమవుతుందా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సందేహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారిపై తక్షణమే అనర్హత వేటు పడేలా చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 04:03 AM