Share News

Supreme Court verdict: తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా?.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ!

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:49 AM

తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని

Supreme Court verdict: తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా?.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ!

  • స్పీకర్‌ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

  • అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం.. తీర్పు ఇవ్వనున్న సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం

న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పది మంది పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కౌశిక్‌ రెడ్డి, వివేకానంద, జీ జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్‌ 3న తీర్పును రిజర్వ్‌ చేసింది. జస్టిస్‌ గవాయ్‌ ప్రస్తుతం సీజేఐగా ఉన్నారు. గురువారం ఆయనతో పాటు జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ తుది తీర్పును వెలువరించనున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారు?’ అని ప్రశ్నించారు. అలాగే, అసెంబ్లీ స్పీకర్‌ కాలయాపనపైనా అసహనం వ్యక్తం చేశారు. ‘నాలుగేళ్లు స్పీకర్‌ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో తీర్పు ఎలా రాబోతోందనే ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 07:08 AM