Share News

Supreme Court: జాగ్రత్తగా ఉండండి!

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:00 AM

రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్‌లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది.

Supreme Court: జాగ్రత్తగా ఉండండి!

  • అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు

  • డిబేట్‌లో ఇతరులతో చేయనివ్వొద్దు

  • సాక్షి యాంకర్‌ కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక

  • జైలు నుంచి విడుదలకు ఆదేశం

న్యూఢిల్లీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని, టీవీ డిబేట్‌లో ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయనివ్వొద్దని సాక్షి చానల్‌ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును సుప్రీంకోర్టు హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్‌లో జాగ్రత్తగా ఉండాలని స్పష్టంచేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సి అవసరం ఉందని, ఆయన వాక్‌స్వాతంత్ర్యాన్ని, జర్నలిస్టు హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆయన్ను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్‌ ఇస్తున్నట్లు పేర్కొంది.


కొమ్మినేని దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రాష్ట్రప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూథ్రా, కొమ్మినేని తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఎవరైనా అసభ్యమైన వ్యాఖ్య చేస్తే.. మనం దానిని నవ్వుతూ తేలికగా తీసుకుంటాం. వారిని సహకుట్రదారులుగా పరిగణించలేం’ అని జస్టిస్‌ మన్మోహన్‌ పేర్కొన్నారు. జస్టిస్‌ మిశ్రా కూడా ఆయనతో ఏకీభవించారు. దీంతో ధర్మాసనం కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశించింది. రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 8 వారాల్లో సమాధానమివ్వాలని ఆదేశించింది.

Updated Date - Jun 14 , 2025 | 04:00 AM