Police Counseling: ఇప్పటికిప్పుడే.. ఇక్కడికిక్కడే..పెళ్లాడతావా.. చావమంటావా
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:53 AM
ఇప్పుడే వివాహం చేసుకుందాం.. లేదంటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటా నంటూ

భువనగిరి బస్టాండ్లో సుదీర్ఘ హైడ్రామా
పోలీసుల కౌన్సెలింగ్తో సమసిన వివాదం
భువనగిరి టౌన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ఇప్పుడే వివాహం చేసుకుందాం.. లేదంటే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటా’’నంటూ ఓ విద్యార్థిని బెదిరింపులు.. ఆమె ఎంతగా బలవంతపెట్టినా పెళ్లికి ససేమిరా అన్న విద్యార్థి! భువనగిరి బస్టాండ్లో మంగళవారం మధ్యాహ్నం మొదలైన ఈ హైడ్రామా.. రాత్రి దాకా కొనసాగి.. ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో ముగిసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని.. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలవాసి)తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ హైదరాబాద్ పరిసరాల్లోని వేర్వేరు హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటున్నారు. మంగళవారం భువనగిరి బస్టాండ్లో కలుసుకున్నారు.
తిరిగి వెళ్లాల్సిన సమయంలో.. ‘‘నిన్ను వదిలి నేను వెళ్లను. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం’’ అని విద్యార్థిని మొండికేసింది. దానికి ఆ విద్యార్థి.. ‘‘ఇప్పుడే వద్దు. జీవితంలో స్థిరపడ్డాకే చేసుకుందాం’’ అని వేడుకున్నాడు. ఇలా ఇద్దరి మధ్య వివాదం రాత్రి దాకా కొనసాగింది. అయినా సయోధ్య కుదరకపోగా ఆమె బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మొదలుపెట్టింది. వీరిద్దరి కదలికలను ఉదయం నుంచి గమనిస్తున్న బస్టాండ్ పారిశుధ్య కార్మికులు, ఆర్టీసి సిబ్బంది, బస్టాండ్ చెక్ పోస్ట్ కానిస్టేబుల్తో పాటు మరికొందరు వారిని మందలించి అక్కణ్నుంచి పంపే ప్రయత్నాలు చేశారు. వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ నంబర్లు అడిగారు. కానీ ఇద్దరూ ఇవ్వలేదు. దీంతో వారు ఆ జంటను పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిర్వహించిన కౌన్సెలింగ్తో ఇద్దరూ ఇళ్లకు వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్ఖఢ్ రాజీనామా వెనుక నితీష్ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి