Bhupalpally: చిన్నారిపై వీధి కుక్కల దాడి
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:39 AM
భూపాలపల్లి జిల్లా జడల్పేటలో వీధి కుక్కల దాడికి బాలిక గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

చిట్యాల/వరంగల్ మెడికల్ ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన సంఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట శివారు గాంధీనగర్లో బుధవారం చోటుచేసుకుంది. గాంధీనగర్కు చెందిన రత్న రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద భూమి చదును పనులు చేయిస్తున్నాడు. ఇంటి నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న బాలిక రత్న నైనిషాపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడిచేశాయి. మెడ, భుజం, వీపుపై తీవ్రంగా గాయపర్చాయి. గమనించిన కుటుంబ సభ్యులు పరుగులు తీసి కుక్కల నుంచి బాలికను కాపాడారు. దాడిలో తీవ్రంగా గాయాలపాలైన నైమిషాను చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కలు చిన్నారిని మూడు చోట్ల కరవడంతో బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.