Singareni: సింగరేణిలో సమ్మె సైరన్
ABN , Publish Date - May 06 , 2025 | 04:06 AM
సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమ రక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, రూ.26వేల కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.

20న సమ్మెకు కార్మిక సంఘాల నోటీసు
రుద్రంపూర్/ గోదావరిఖని, మే 5 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు పరిశ్రమ రక్షణ, నూతన బొగ్గు గనుల ఏర్పాటు, రూ.26వేల కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం తదితర 17 డిమాండ్ల పరిష్కారానికి సింగరేణిలో సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. 20న సమ్మె నిర్వహిస్తామని పలు కార్మిక సంఘాల ప్రతినిధులు సోమవారం సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాంకు సమ్మె నోటీసు అందజేశారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ (సెంట్రల్) డి. శ్రీనివాసులుకు కూడా సమ్మె నోటీసును ఇచ్చినట్లు కార్మికసంఘాల నాయకులు రియాజ్ అహ్మద్, సీతారామయ్య, గట్టయ్య, రాములు, మణిరాంసింగ్ తదితరులు తెలిపారు. బొగ్గు బ్లాక్లను కేంద్రం సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.
సంస్థవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెలో సింగరేణి కార్మికులు భాగస్వాములు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా కొన్ని కార్మిక సంఘాలు వ్యవహరించడం అన్యాయమన్నారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణిలో నూతన భూగర్భ గనులకు అనుమతించాలని, సంస్థలో పనిచేస్తున్న 35వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కోల్ ఇండియాలో మాదిరి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం మనుగడకు ముప్పు తెస్తున్న 4 లేబర్ కోడ్లను మోదీ ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు భాగస్వాములు కావాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య కోరారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో జీఎం(పర్సనల్) కవితానాయుడుకి సమ్మె నోటీసును అందజేశారు.