Seethakka: కిశోర బాలికలకు పల్లీ, చిరుధాన్యాల పట్టీ
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:24 AM
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మెరుగుపరచడం, మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యునిసెఫ్ నిపుణులతో కమిటీ వేశామని, వారి నివేదిక ఆధారంగా ఆహారంలో మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.

ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు : మంత్రి సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మెరుగుపరచడం, మరింత రుచికరంగా మార్చేందుకు ఎన్ఐఎన్, యునిసెఫ్ నిపుణులతో కమిటీ వేశామని, వారి నివేదిక ఆధారంగా ఆహారంలో మార్పులు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ 2025-26 కార్యాచరణ ప్రణాళికపై సోమవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 14-18 ఏళ్లలోపు కిశోర బాలికలకు పల్లీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తామన్నారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలు చేస్తామన్నారు. కిశోర బాలికల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేసేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు.