Jogipet: డ్రోన్ దీదీలు
ABN , Publish Date - May 26 , 2025 | 03:46 AM
సంకల్ప బలానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చు.. ఇదీ సంగారెడ్డి జిల్లా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల గురించి చెబుతూ వారిపై ‘మన్కీ బాత్’ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్య! ఆయన చెప్పినట్లుగానే వారంతా నూతన విప్లవానికి నాంది పలికారు.

ఎరువులు, పురుగు మందులను డ్రోన్లతో
పిచికారి చేస్తూ సంగారెడ్డి మహిళల ఉపాధి
‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద శిక్షణ
డ్రోన్ ధర 10 లక్షలు.. 80ు సబ్సిడీ
ఎకరా 8 నిమిషాల్లోపే పిచికారి.. గంటకు
అద్దె 500.. లాభదాయకమన్న మహిళలు
మన్కీబాత్లో ప్రధాని మోదీ ప్రస్తావన
జోగిపేట, మే 25 (ఆంధ్రజ్యోతి): సంకల్ప బలానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చు.. ఇదీ సంగారెడ్డి జిల్లా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల గురించి చెబుతూ వారిపై ‘మన్కీ బాత్’ వేదికగా ప్రధాని మోదీ చేసిన ప్రశంసాపూర్వకమైన వ్యాఖ్య! ఆయన చెప్పినట్లుగానే వారంతా నూతన విప్లవానికి నాంది పలికారు. మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచారు. పంటలకు పురుగు మందులు, ఎరువులు చల్లడం కోసం డ్రోన్లనను అత్యంత నేర్పుగా ఉపయోగించడం ద్వారా దేశంలో ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మన్కీ బాత్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళల ఘనతను మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో డ్రోన్ల ఉపయోగంలో అక్కడి మహిళల శిక్షణ సాగిన తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనమిది! కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాలకు చెందిన 50 మంది ఎస్హెచ్జీ మహిళలు డ్రోన్ల ద్వారా పురుగుమందులను పిచికారి చేయడం, ఎరువులను చల్లడంపై శిక్షణ పొందారు. మార్చి 20న జోగిపేటలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ప్రారంభించారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ సాగింది. డ్రోన్ ఆపరేటింగ్లో ఫ్లయింగ్ వెడ్స్ సంస్థ సహాయం చేయగా, సింక్రో సంస్థ సాంకేతిక సహకారాన్నిచ్చింది. శిక్షణ ముగిశాక ఆ మహిళలు మే నెలలో జిల్లాలో 50 ఎకరాలకు పైగా వివిధ పంటలకు డ్రోన్ ద్వారా పురుగు మందులను పిచికారి చేశారు. కాగా డ్రోన్ ధర రూ.10 లక్షలు! శిక్షణ పొందిన మహిళలు మొత్తం ధరలో 20శాతం చెల్లిస్తే.. 80శాతం సబ్సిడీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సబ్సిడీ పోనూ మిగిలిన రూ.2లక్షలను వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. కలెక్టర్ క్రాంతి చొరవతో ప్రభుత్వ నిధులతో రెండు విడతల్లో 10 డ్రోన్లు కొనుగోలు చేసి మహిళలకు ఇచ్చారు.
ఏడాది పొడవునా ఆదాయమే
ఒక డ్రోన్తో ఒకరు ఆపరేటర్గా మరొకరు సహాయకురాలిగా ఉపాధి పొందొచ్చు. వరి సీజన్లోనే కాకుండా ఏడాదంతా ఈ డ్రోన్లతో పండ్ల తోటలు, కూరగాయలు, పత్తి తదితర పంటలకు మందులు పిచికారి చేయడమో.. ఎరువులు వేయడమో చేయొచ్చు. తద్వారా సంవత్సరం మొత్తం ఆదాయం పొందొచ్చు.
- మాణిక్యం, ఇందిరా క్రాంతి పథం ఏపీఎం-అందోల్
నెలకు రూ. 2 లక్షలు రాబడి
డ్రోన్ నడపడం ఎంతో ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తోంది. డ్రోన్ నడపడం ద్వారా నెలకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. డ్రోన్ ద్వారా ఒక ఎకరా పొలంలో మందులు పిచికారి, ఎరువులు చల్లడం వంటి పనులను 5 నుంచి 8 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. డ్రోన్తో పిచికారి చేయడానికి గంటకు రూ. 500 ధరను నిర్ణయించారు. ఈలెక్కన రోజుకు కనిష్ఠంగా 20 ఎకరాల చొప్పున కనిష్ఠంగా 20 రోజుల పని దొరికినా రూ. 2 లక్షల ఆదాయం వస్తుంది.
-బేగరి అనిత, అల్మాయిపేట, అందోల్ మండలం
8 లక్షల సబ్సిడీ.. సంతోషకరం
మహిళా సంఘ సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8 లక్షల సబ్సిడీతో డ్రోన్ను అందజేయడం సంతోషం కలిగిస్తోంది. డ్రోన్ ఆపరేటింగ్పై 9 రోజులపాటు శిక్షణనిచ్చారు. డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తే విషపూరితమైన రసాయనాల ప్రభావం మనపై ఉండదు.
- చంద్రకళ, దిగ్వాల్, కోహీర్ మండలం
మహిళలకు లాభదాయకం
ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రోన్లను అందించడం మహిళా సంఘాలసభ్యులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మేమందరం తొమ్మిది రోజులపాటు డ్రోన్ ఆపరేటింగ్లో శిక్షణ పొందాం. పంటల సాగులో అవసరమయ్యే మందుల పిచికారి కోసం డ్రోన్లను వినియోగించడం ద్వారా మా గ్రూపును ఆర్థికంగా బలోపేతం చేసుకుంటాం.
- సురేఖ, కోహీర్ మండల కేంద్రం
ఇవి కూడా చదవండి
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం