RTC employees: ఆర్టీసీ ఉద్యోగులకు నిరాశే!
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:51 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిరాశే మిగిలింది.

క్యాబినెట్ సమావేశంలో చర్చకు రాని వారి సమస్యలు
తదుపరి కార్యాచరణపై 9న జేఏసీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిరాశే మిగిలింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, విద్యుత్ బస్సుల్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడం, వెల్ఫేర్ కమిటీల రద్దు తదితర 21 ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ గత నెలలో సమ్మెకు పిలుపునిచ్చింది. జేఏసీ నాయకులతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యల్ని దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేశారు. ఇది జరిగి నెల రోజులు దాటినా... తమ డిమాండ్లలో ఇప్పటి వరకు ఏ ఒక్కటీ పరిష్కారం కాకపోవడంతో జేఏసీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు.
చేసేది లేక క్యాబినెట్ సమావేశంలోనైనా తమ సమస్యలను సీఎం వద్ద చర్చించి, సాధ్యమైన వాటిని పరిష్కరించాలని జేఏసీ నాయకులు మరోసారి మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. కానీ క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ సమస్యలపై కనీస చర్చ జరగకపోవడంతో జేఏసీ, ఉద్యోగులు నిరాశ చెందారు. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 9న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. మరో వైపు ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఈ నెల 17న ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్షకు స్టాఫ్, వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది.