RTC Bus: ఆర్టీసీ బస్సుకు నిప్పు... 20 లక్షల నష్టం
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:45 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది.

పోలీసుల అదుపులో అయిదుగురు అనుమానితులు
మిర్యాలగూడ అర్బన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నిలిపిఉంచిన ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో బస్సు లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఆర్టీసీకి సుమారు రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును రోజూవారీగా మంగళవారం రాత్రి తడకమళ్ల గ్రామంలో నిలిపి (నైట్హాల్ట్) ఉంచారు. వర్షం కురుస్తుండడంతో డ్రైవర్ శంకరయ్య, కండక్టర్ బాలకృష్ణ పక్కనే ఉన్న పాఠశాల భవనంలో నిద్రించడానికి వెళ్లారు.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన వారు వెంటనే గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. బస్సు డ్రైవర్ క్యాబిన్ డోర్ తెరిచి చూడగా, లోపల మద్యం సీసాలు కనిపించాయి. గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో మద్యం తాగి, ఆ తర్వాత నిప్పుపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, అప్పటికే బస్సు లోపలి భాగం, వెనుక టైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తడకమళ్లకు చెందిన ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.