నాలుగు నిమిషాల్లో ఏటీఎంలో రూ. 29 లక్షల చోరీ
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:52 AM
తెల్లవారుజామున ఓ ఏటీఎంను పగలగొట్టి రూ.29.60 లక్షలతో ఉడాయించారు దుండగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సీసీ కెమెరాలకు స్ర్పే కొట్టి దొంగతనం
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఘటన
ఆదిభట్ల, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): తెల్లవారుజామున ఓ ఏటీఎంను పగలగొట్టి రూ.29.60 లక్షలతో ఉడాయించారు దుండగులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు కారులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ముందుగా సీసీ కెమెరాలకు స్ర్పే కొట్టి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. తర్వాత కట్టర్, ఇనుపరాడ్ల సహాయంతో ఏటీఎంను పగులకొట్టి నాలుగు నిమిషాల్లోనే రూ.29.69 లక్షలు తీసుకొని పారిపోయారు. దొంగతనం జరిగిన విషయం హైదరాబాద్లోని ఐబీఐఎస్ స్విచ్ సెంటర్ నుంచి బ్యాంక్ మేనేజర్కు సమాచారం వెళ్లింది. దీంతో మేనేజర్ ఆదిభట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి డీసీపీ సునితారెడ్డి చేరుకొని పరిశీలించారు. దొంగలను పట్టుకోవడానికి నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.