ACB Raid: భూరికార్డుల నమోదుకు రూ.9లక్షల లంచం!
ABN , Publish Date - May 29 , 2025 | 04:16 AM
భూమిని రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.

ఏసీబీకి పట్టుబడ్డ ఇబ్రహీంపట్నం ఆర్ఐ
ఇబ్రహీంపట్నం, మే 28 (ఆంధ్రజ్యోతి): భూమిని రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేసిన ఆర్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల గ్రామంలోని సర్వే నెం.355లో ఇమ్మడి శ్రీశైలం అనే వ్యక్తికి 1.16 ఎకరాల భూమి ఉంది. దానిలో ఏడు గుంటల భూమి రికార్డుల్లో తక్కువగా చూపిస్తోంది. ఇదే విషయమై శ్రీశైలం ఆయన కుమారుడు బాలకృష్ణ ఇబ్రహీంపట్నం ఆర్ఐ జి.కృష్ణను సంప్రదించారు.
ఆ భూమిని ఆన్లైన్ ద్వారా రికార్డుల్లో నమోదు చేయడానికి ఆర్ఐ కృష్ణ రూ.12 లక్షలు డిమాండ్ చేశాడు. పైఅధికారులకు కూడా లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చివరకు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధిత రైతు బాలకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫోన్లోని సంభాషణల ఆధారంగా బుధవారం డీఎస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జోన్ ఏసీబీ బృందం తహసీల్దార్ కార్యాలయంపై దాడులు నిర్వహించింది. ఆర్ఐ కృష్ణను అదుపులోకి తీసుకుంది.