Jagityal: కోరుట్ల చిన్నారిని చంపింది చిన్నమ్మేనా?
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:09 AM
జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక(బాబాయ్ భార్య) చిన్నమ్మ మమతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో అనుమానితురాలు
ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే దారుణం
కోరుట్ల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక(బాబాయ్ భార్య) చిన్నమ్మ మమతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి హితీక్షను గొంతు కోసి చంపి పక్కింటి బాత్రూంలో పడేసిన ఘటన శనివారం కలకలం రేపింది. ఘటనా స్థలం దగ్గర జాగిలాలతో తనిఖీలు చేపట్టగా అవి హితీక్ష ఇంటిలోకి వెళ్లి నిలిచిపోవడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేశశరు. ఇంట్లో ఉన్న వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంట్లోకి వచ్చిపోయే వారి వివరాలతో పాటు హితీక్ష చిన్నమ్మ మమత ఫోన్ డేటాను పరిశీలించారు.
మమత సెల్ఫోన్లో హత్య చేయడానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా మమత సాయంత్రం 6:30 గంటల నుంచి మృతదేహం దొరికే వరకు ఐదుసార్లు అదే ప్రాంతానికి వచ్చిపోయినట్లు గుర్తించారు. తనను ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే మమత తన తోడి కోడలు నవీనపై కక్ష పెంచుకొని ఆమె కూతురు హితీక్షను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మమత హత్య కోసం వాడిన పరికరాలతో పాటు ఆమె వేసుకున్న లెగ్గిన్ను పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు సేకరించినట్లు తెలిసింది. కాగా, మమత ఆన్లైన్ గేమ్స్తో పాటు బిట్ కాయిన్లో పెట్టుబడి పెట్టి రూ.25లక్షలు పోగొట్టుకున్నట్టు తెలిసింది.