Ponnam Prabhakar: హలం పట్టి.. పొలం దున్ని..
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:29 AM
మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నాగలి పట్టి.. దుక్కి దున్ని విత్తనాలు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఆయన రైతులతో కలిసి దుక్కి దున్నారు.

ఏరువాక పున్నమిలో మంత్రి పొన్నం
హుస్నాబాద్ రూరల్ /కోహెడ /మేళ్లచెర్వు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నాగలి పట్టి.. దుక్కి దున్ని విత్తనాలు వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలో ఏరువాక పున్నమి సందర్భంగా ఆయన రైతులతో కలిసి దుక్కి దున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానాకాలంలో ఎక్కడా గుంట భూమి కూడా బీడు లేకుడా ఏదో ఒక రకమైన పంట వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో విత్తనాలు కొనుగోలు చేసుకోలేని రైతులు ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలన్ని, స్వయంగా విత్తనాలు కొనుగోలు చేసి, రైతులకు ఇస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన మాట ప్రకారం ఆదుకున్నారు. కోహెడ మండలం బస్వాపూర్లో బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్లను అందజేశారు. వారి పిల్లల చదువులకు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.
మేళ్లచెర్వులో ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో బుధవారం ఏరువాక పౌర్ణమి ఉత్సవాలను రైతులు ఘనంగా నిర్వహించారు. జ్యేష్ట శుద్ధ ఏరువాక పౌర్ణమిని తొలి పండుగగా రైతులు భావించడం ఆనవాయితీ. దీంతో రైతులు కాడెద్దులను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. గ్రామ వీధుల్లో మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ఏరువాక గణపయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఎవరి పొలానికి వారు దున్నకాలకు వెళ్లారు.