Heatwave: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం
ABN , Publish Date - May 03 , 2025 | 04:07 AM
రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో వడగాలుల ప్రభావిత మండలాలు 588
రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు
తాగునీరు, మజ్జిగ అందించాలి
సీఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలి
అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం
‘వడగాలులపై ప్రణాళిక’ విడుదల
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు అందించే పరిహారం గతంలో రూ.50 వేలు ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.4 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఆయన 12 శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఐఎండీ కలిసి ‘వడగాలుల కార్యాచరణ ప్రణాళిక-2025’ను రూపొందించాయి. మంత్రి ఈ ప్రణాళికను విడుదల చేశారు. ఇందులో భాగంగా జిల్లాకో నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయాలని ఆదేశించారు. సీఎ్సఆర్ నిధులతో వీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణలో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామన్నారు. వడగాలుల ప్రభావం సామాన్యులపై పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. వడదెబ్బతో ఎవరైనా మరణిస్తే మానవతా దృక్పథంతో వ్యవహరించి, తక్షణమే పరిహారం అందేలా చూడాలని సూచించారు. బస్టాండ్లు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాలు, ప్రార్థనా స్థలాల వంటి చోట్ల అవసరమైన షెల్టర్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల తరఫున ప్రజలకు రక్షిత తాగునీటిని సరఫరా చేయాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News