Nirmal: భూభారతిలో ఏఎస్సై అతి
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:53 AM
తన సమస్యను అధికారులకు చెప్పుకుందామని భూభారతి సదస్సుకు వచ్చిన ఓ రైతు పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.

వృద్ధ రైతును మెడబట్టి బయటికి..
నిర్మల్ జిల్లాలో ఘటన.. ఏఎస్సై సస్పెన్షన్
ఖానాపూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): తన సమస్యను అధికారులకు చెప్పుకుందామని భూభారతి సదస్సుకు వచ్చిన ఓ రైతు పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. సదరు రైతు చేతి కర్ర సాయంతో నిలబడి ఉన్న వృద్ధుడు అనే విచక్షణ కూడా లేకుండా మెడ పట్టుకుని బయటికి లాగేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో రెవెన్యూ అధికారులు బుధవారం నిర్వహించిన భూభారతి సదస్సులో ఈ ఘటన జరిగింది. పాత ఎల్లాపూర్కు చెందిన అల్లెపు వెంకటి అనే రైతు తన భూసమస్యను అధికారులకు చెప్పుకునేందుకు భూభారతి సదస్సుకు హాజరయ్యాడు. అధికారులు ఉన్న గదిలోకి వెళ్లిన వెంకటి తన సమస్యను వారికి చెప్పే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో అక్కడ భద్రత విధులు నిర్వర్తిస్తున్న ఖానాపూర్ ఏఎస్సై కాంబ్లి రామచందర్ సదరు రైతు మెడ పట్టుకొని బలవంతంగా ఆ గదిలో నుంచి బయటికి లాక్కొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా విషయం తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల వివాదానికి కారణమైన ఏఎస్సై రామచందర్ను సస్పెండ్ చేశారు. ఇక, రైతుకు జరిగిన అవమానంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదేనా ప్రజాపాలన ? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి