Acharya Balakista Reddy: ఇంజనీరింగ్లో బోలెడన్ని సీట్లు
ABN , Publish Date - Jun 11 , 2025 | 07:13 AM
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సీటు వస్తుందా, రాదా అనే అనుమానాలు వద్దని.. రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు.

యాజమాన్య కోటా సీట్ల కోసం డబ్బులు వృథా చేసుకోవద్దు
బీ-క్యాటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదు
అనుమతి లేని విద్యాసంస్థలతో జాగ్రత్త
జూలై మొదటివారంలో ఎప్సెట్ కౌన్సెలింగ్
ఫీజుల పెంపుపై త్వరలో ప్రభుత్వ నిర్ణయం
ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో సీటు వస్తుందా, రాదా అనే అనుమానాలు వద్దని.. రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసిందని.. సీట్ల కోసం డొనేషన్ కట్టి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రైవేటు కాలేజీల్లో బీ-క్యాటగిరీ సీట్ల భర్తీకి ప్రభుత్వం ఇంకా అనుమతించలేదని, నిబంధనలకు వ్యతిరేకంగా ముందే భర్తీ చేస్తే చర్యలు తప్పవని కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించారు. మంగళవారం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఈ.పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్లతో కలిసి బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎప్సెట్ కౌన్సెలింగ్ను జూలై మొదటివారంలో ప్రారంభిస్తామని, ఆగస్టు 14లోపు పూర్తి చేస్తావని చెప్పారు. విద్యార్థులకు అవగాహన కోసం మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. వృత్తివిద్యా కోర్సుల ఫీజులు పెంచే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
అనుమతి లేని కాలేజీలతో జాగ్రత్త..
అనుమతి లేని కాలేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆచార్య బాలకిష్టారెడ్డి విద్యార్థులు, తల్లిదండ్రులను కోరారు. హైదరాబాద్ నానక్రాంగూడ వీవర్క్ రాజపుష్ప సమిట్లోని నెక్స్ట్ వేవ్ విద్యాసంస్థ, మాదాపూర్ ఇనార్బిట్ మాల్లోని బైట్ ఎక్సెల్ టెక్ ఎడ్ ప్రైవేట్ లిమిటెడ్, నానక్రాంగూడలోని మైస్కేప్ వ్యూబిల్డింగ్లోని లీప్స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైటెక్ సిటీ సైబర్ టవర్స్లోని ఇంటెల్లిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ తదితర సంస్థలకు ఏఐసీటీఈ గుర్తింపు లేదని తెలిపారు. ఈ విద్యాసంస్థలు గత ఏడాది అడ్మిషన్లు నిర్వహించాయని, ఈఏడాది కూడా ప్రవేశాల పేరుతో రూ.10-12 లక్షలు వసూలు చేస్తున్నాయని వివరించారు. ఆ విద్యా సంస్థలకు లీగల్ నోటీసులు పంపామని, త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మల్లారెడ్డి యునివర్సిటీ, అరోరా, చైతన్య కాలేజీలు వాటి నిర్వహణకు తోడ్పడుతున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందని.. సమగ్ర విచారణ చేసి ఈ కాలేజీలపైనా చర్యల కోసం ఏఐసీటీఈకి సిఫార్సు చేస్తామని వివరించారు. ఉన్నత విద్యామండలికి మరిన్ని అధికారాలు కల్పించేందుకు ఉన్నత విద్య సంస్కరణ బిల్లు ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.