Drone Technology: ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ?
ABN , Publish Date - May 29 , 2025 | 03:57 AM
భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.

భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు
ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు
పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే
డ్రోన్లు, డీజీపీఎస్ వినియోగం
అన్నీ తేల్చాకే నక్ష మ్యాపుల తయారీ
75 ఏళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి
పైలెట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు
సంగారెడ్డి, (ఆంధ్రజ్యోతి): మే 28: భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఐదు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దీని నిర్వాహణ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు. ఈ గ్రామాల్లోని భూముల కొలతలు తేల్చడానికి ఆధునిక డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. భూ భారతి సర్వే మ్యాపులను సిద్ధం చేయడానికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పూరు మండలం కొమ్మనపల్లి, మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నూగూరు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహెద్నగర్ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్వే ఏజెన్సీల సిబ్బంది భూముల హద్దులు గుర్తించే పనిలో ఉన్నారు.
ఆకాశంలో ఆధునిక డ్రోన్లు
అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఆధునిక డ్రోన్లు సంగారెడ్డి జిల్లా షాహెద్నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలో ఉన్న డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు. సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఎరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షాహెద్నగర్లో 21 సర్వే నంబర్లలో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 279 మంది రైతులకు పాస్బుక్కుల ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించే పనిలో వీరు ఉన్నారు. ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాపులు తయారు చేయనున్నారు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు. ఇందులో కచ్చితత్వం ఉందా.. లేదా? అని నిర్ధారించుకోవడానికి డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ను వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని సర్వేయర్లు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. రెండు రకాల సర్వేలో తేడాలు ఉన్నాయా.. లేక రెండింటిలోనూ ఒకే రకమైన కొలతలు వచ్చాయా? అని తేల్చిన తర్వాతనే మ్యాపులు సిద్ధం చేయనున్నారు.
నక్ష స్థానంలో మ్యాపులు
నిజాం రాజుల కాలంలో గొలుసుల ద్వారా భూముల కొలతలు వేసి ప్రతి గ్రామానికి టీపన్ నక్షా తయారు చేశారు. ఈ టీపన్ నక్షాలో సర్వే నంబర్ల వారీగా భూముల విస్తీర్ణం, గ్రామాల్లోని రహదారులు, బాటలు సైతం ఉంటాయి. గడిచిన 75 ఏళ్లుగా భూముల సర్వేకు టిప్పన్ నక్షే ప్రమాణం. తాజా సర్వేతో ప్రతి గ్రామానికి డిజటల్ మ్యాపులు సిద్ధం చేయనున్నారు. దీంతో ఇప్పటిదాకా భూములకు ఆధారంగా ఉన్న టీపన్ నక్షా కథ కంచికి చేరనుంది. గ్రామాల హద్దులతోపాటు సర్వేనంబర్ల వారీగా సర్వే పూర్తయిందంటే ఇక టీపన్తో పని ఉండదని సీనియర్ సర్వేయర్లు చెబుతున్నారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..