Share News

Phone Tapping Case: నేడు మళ్లీ ప్రభాకర్‌రావు విచారణ

ABN , Publish Date - Jun 11 , 2025 | 07:25 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌(ఓఎస్డీ) టి.ప్రభాకర్‌రావు బుధవారం సిట్‌ విచారణకు హజరుకానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో...

Phone Tapping Case: నేడు మళ్లీ ప్రభాకర్‌రావు విచారణ

  • సెల్‌ఫోన్లను అప్పగించాలని సిట్‌ ఆదేశం

  • నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌(ఓఎస్డీ) టి.ప్రభాకర్‌రావు బుధవారం సిట్‌ విచారణకు హజరుకానున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక, అనధికారిక సెల్‌ఫోన్లను తమకు అప్పగించాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌, మ్యాక్‌ నోట్‌బుక్‌లను సైతం అందజేయాలని సూచించారు. తొలిరోజు విచారణలో ప్రభాకర్‌రావు విచారణాధికారులకు సరిగ్గా సహకరించక, ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటి వరకు అరెస్టు అయిన రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావు వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ(ఎ్‌ఫఎ్‌సఎల్‌) నుంచి రిట్రీవ్‌ చేసిన డాటా ఆధారంగా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. కొందరూ న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్‌ను ఎందుకు తయా రు చేయాల్సి వచ్చింది? స్పెషల్‌ ఆపరేషన్‌ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు? హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాకు తెలియకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ ఎలా చేశారు? అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి, ప్రశ్నించడానికి సిట్‌ అధికారులు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాకర్‌రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలంటూ సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి.. ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్‌రావు కోర్టులో హజరుకావాలని ఆదేశించారు. అయితే.. సంబంధింత న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ప్రభాకర్‌రావు వెనుదిరిగారు.

Updated Date - Jun 11 , 2025 | 07:26 AM