Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు
ABN , Publish Date - May 07 , 2025 | 09:27 PM
తెలంగాణలో మాక్ డ్రిల్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు అనేక ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను కట్టదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు రేపు సాయంత్రం భారత సైన్యానికి సంఘీభావంగా నిర్వహించే ర్యాలీలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్: తెలంగాణలో భద్రతా పరిస్థితులను బలోపేతం చేయడంలో భాగంగా, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor), మాక్ డ్రిల్ అనంతరం ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర భద్రతా యంత్రాంగం సంసిద్ధతను పరిశీలించి, ముందస్తు చర్యలపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరోధించడానికి, ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడానికి ఉద్దేశించినవి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..
సమీక్ష సమావేశంలో, రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని ఆర్మీ, నేవీ కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, విదేశీ రాయబార కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో పర్యటిస్తున్న విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని, కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
సెలవులు బంద్..
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరం దేశ రక్షణ పరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. ఈ నేపథ్యంలో, రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఐటీ సంస్థలు, విమానాశ్రయం, రక్షణ సంస్థల వద్ద భద్రతను పెంచాలి. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేసుకుని, సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
అన్ని శాఖల సమన్వయం..
సమీక్ష సమావేశంలో, అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి, నిరంతర నిఘా, పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
వెంటనే చర్యలు..
రాష్ట్ర ప్రభుత్వం ఈ సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడానికి చర్యలు చేపట్టింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎస్, డీజీపీ, స్థానిక మిలటరీ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సాయంత్రం జరిగిన మాక్ డ్రిల్ను స్వయంగా పర్యవేక్షించి, రాష్ట్ర యంత్రాంగం సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
భారత సైన్యానికి సంఘీభావ ర్యాలీ..
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి నైతిక మద్దతు ఇవ్వడానికి, మే 8న సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం నిర్ణయించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదన్నారు. భారత సైన్యానికి మనం నైతికంగా అండగా నిలవాలని కోరారు. యువత ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని, సైన్యానికి సంఘీభావం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News