Indian Military: ఆపరేషన్ సిందూర్ అద్భుత విజయం
ABN , Publish Date - May 18 , 2025 | 04:27 AM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందని ట్యాంక్బండ్పై నిర్వహించిన తిరంగా ర్యాలీలో వక్తలు చెప్పారు.

3 రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిన పాకిస్థాన్
యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోదీ
ట్యాంక్బండ్పై తిరంగా ర్యాలీలో వక్తల ప్రశంసలు
వేలాది మందితో జరిగిన ర్యాలీ.. పాల్గొన్న వెంకయ్యనాయుడు, కిషన్రెడ్డి, విద్యాసాగర్రావు
హైదరాబాద్, కవాడిగూడ, మే 17(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందని ట్యాంక్బండ్పై నిర్వహించిన తిరంగా ర్యాలీలో వక్తలు చెప్పారు. పాక్ ఎయిర్ బేస్లపై బ్రహ్మోస్ క్షిపణుల వర్షంతో భీతిల్లిన పాక్ మూడు రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిందన్నారు. కాల్పుల విరమణకు ఒప్పుకోవడం ద్వారా యుద్ధాన్ని నివారిస్తూ ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని నేతలు కీర్తించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా సైనికులకు సంఘీభావంగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ మీదుగా చిల్ట్రన్ పార్కువద్ద ఉన్న యుద్ధ ట్యాంకు వరకు వేలాదిమందితో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది జాతీయ జెండాలు చేతబూని జై జవాన్, జై కిసాన్, వందేమాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రక్షణశాఖ మాజీ సలహాదారు సతీశ్ రెడ్డి ఓపెన్ టాప్ వాహనం ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పాకిస్థాన్తో చర్చలు జరిగితే పీఓకే విలీనంపైనే జరుగుతాయని, ఈ విషయంలో అమెరికా, చైనా తదితర దేశాల జోక్యం అవసరం లేదని, సమస్యను పరిష్కరించుకునే సత్తా భారత్కు ఉందన్నారు. ఆపరేషన్ సిందూర్లో విరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జేజేలు కొట్టాలన్నారు. దేశాన్ని కాపాడుకోవడానికే భారత్ ఎదురు దాడికి దిగిందని, ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంకయ్య చెప్పారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. స్లీపర్ సెల్స్ హైదరాబాద్లోనే ఉన్నారని, ఇంటి దొంగలను గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ఉగ్రవాదుల అంతు చూసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏమిటో పాకిస్థాన్ చూసిందన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్ రెడ్డి మాట్లాడుతూ... పాకిస్థాన్ వైమానిక స్థావరాలపై వేసిన బ్రహ్మోస్ క్షిపణులు, డ్రోన్లను కూల్చేసే యాంటీ డ్రోన్ సిస్టమ్ హైదరాబాద్లోనే తయారు చేసినవేనన్నారు. లెఫ్టినెంట్ జనరల్ రవిప్రసాద్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కనీవినీ ఎరుగని గొప్ప విజయమన్నారు. మాజీ ఎంపీ, సినీనటి జయప్రద మాట్లాడుతూ ఆడపడుచుల నుదిటిపై సింధూరాన్ని తుడిచి వేస్తే ప్రతికారం ఎలా ఉంటుందో పాకిస్థాన్కు మోదీ చూపించారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మాజీ సైనికాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరంగా ర్యాలీలో మందకృష్ణ మాదిగ కాలుకు స్వల్పగాయం
తిరంగా ర్యాలీ సందర్భంగా ట్యాంక్బండ్ యుద్ధ ట్యాంక్ వద్ద జరిగిన సభలో తోపులాట జరగడంతో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాలుకు స్వల్పంగా గాయమైంది. వెంటనే అనుచరులు ఆయనున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News