Indian Air Force: ఆపరేషన్ సిందూర్ ఎయిర్ ఫోర్స్ శక్తికి నిదర్శనం
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:49 AM
భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనంగా నిలిచిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు.

యుద్ధరంగంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందే
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో భారత వైమానిక దళాధిపతి అమర్పీత్ర్ సింగ్
అల్వాల్, జూన్14 (ఆంధ్రజ్యోతి): భారత వైమానిక దళ సామర్థ్యం, పోరాట పటిమ, కార్యాచరణకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనంగా నిలిచిందని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్లో భారత వైమానిక దళం అపారమైన పరాక్రమాన్ని ప్రదర్శించిందన్నారు. శత్రువులపై వేగంగా, కచ్చితత్వంతో, నిర్ణయాత్మక దాడులు చేసి వారిని కోలుకోలేని దెబ్బ తీసిందని చెప్పారు.
యుద్ధ రంగంలో ఎయిర్ ఫోర్స్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా 254మంది ఫ్లైట్ కేడెట్లు నిర్వహించిన కవాతును ఆయన తిలకించారు. వారికి ప్రెసిడెంట్ కమిషన్తో పాటు వింగ్స్ను ప్రదానం చేశారు. పరేడ్ అనంతరం ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రదర్శించిన స్కై డైవింగ్, సుఖోయ్-30, ఆకాశ్, సూర్య కిరణ్, ఫిలాటస్ పీసీ-7 ఎయిర్క్రా్ఫ్టల విన్యాసాలు అబ్బురపరిచాయి. వాయుసేనకు చెంది న ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.