Operation Karraguttalu: చిత్తడిగా కర్రెగుట్టలు
ABN , Publish Date - May 07 , 2025 | 04:46 AM
మాన్సూన్ వర్షాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న నక్సలైట్లను అన్వేషించే బలగాలకు పెద్ద అడ్డంకిగా మారాయి. వర్షాల వల్ల అడవులు దట్టమైపోయాయి, గుట్టల మధ్య పథాలు చిత్తడిగా మారాయి. అయినప్పటికీ, బలగాలు 250 బాంబులను నిర్వీర్యం చేసి, నక్సలైట్లతో ఘనమైన ఎన్కౌంటర్ను నిర్వహించాయి.

వర్షాలతో మళ్లీ దట్టంగా అడవి.. గుట్టల మధ్యన చిత్తడి నేలలు
250 బాంబులను నిర్వీర్యం చేసిన బలగాలు
చర్ల/దుమ్ముగూడెం/కొత్తగూడెం, మే 6 (ఆంధ్రజ్యోతి): ఎండాకాలం.. ఆకులు రాలి.. కర్రెగుట్టల్లో నక్కిన మావోయిస్టులను గుర్తించాలనే పోలీసుల ఆలోచనలకు అకాల వర్షాలు అడ్డంకిగా మారాయి. మొన్నటి వరకు ఉక్కబోతతో మండే కొలిమిని తలపించిన కర్రెగుట్టలు.. రెండు వర్షాలకే మళ్లీ పచ్చటి, దట్టమైన అడవిగా.. గంభీరంగా మారిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. గుట్టల పైనుంచి జలపాతాల్లోంచి నీళ్లు జాలువారుతున్నాయి. వర్షాల కారణంగా గుట్టల మధ్య దారులు చిత్తడిగా మారిపోయాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికే చీకటిపడుతూ.. ఆపరేషన్లో ఉన్న జవాన్లకు ఇబ్బందిగా మారుతోంది. పైగా.. చిత్తడి దారుల్లో విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ బలగాల పాలిట మరింత కఠినంగా మారాయి. మావోయిస్టుల గాలింపు క్లిష్టంగా మారుతోంది. అటు మావోయిస్టులు తెలంగాణలోని పూసుగుప్ప వైపు వచ్చినట్లు కేంద్ర బలగాలు అనుమానిస్తూ.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
అడుగడుగునా ప్రమాదం?
మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి వెళ్లే ముందు ఎక్కడికక్కడ మందుపాతరలు, ప్రెజర్ బాంబులను అమర్చారు. డ్రోన్ కెమెరాలకు మావోయిస్టుల కదలికలు చిక్కినా.. ఆ ప్రాంతాలకు బలగాలు చేరుకోవడం కత్తిమీద సాముగా మారుతోంది. మంగళవారం ఒక్కరోజే జవాన్లు 250 బాంబులను గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఒకరు ఓ జవాన్ను కాపాడబోయి.. ప్రెజర్ బాంబుపై కాలు వేశారు. ఈ ఘటనలో ఆ అధికారి కాలు తెగిపడినట్లు సమాచారం. మంగళవారం బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరువైపులా భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనాస్థలి నుంచి ఓ మహిళా నక్సలైట్ మృతదేహం, 303-రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో చాలా మంది నక్సల్స్ మృతిచెంది ఉంటారని ఆ ప్రెస్నోట్లో అనుమానం వ్యక్తం చేశారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉండి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నలుగురు మహిళా నక్సలైట్లు చనిపోయారని, వందల సంఖ్యలో మావోయిస్టుల స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామన్నారు. కాగా, ఛత్తీ్స్లోని సుక్మా జిల్లా తర్లగూడెం పంచాయతీ ఉపసర్పంచ్ ముచకి రామను మావోయిస్టులు హత్య చేశారు.
14 మంది లొంగుబాటు
తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ చేయూత’కు భారీ స్పందన వస్తోందని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. మంగళవారం 14 మంది మావోయిస్టులు ఆయన ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా నక్సలైట్లు ఉన్నారు. తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ చేయూత’ను ప్రకటించినప్పటి నుంచి 227 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు వివరించారు.
పూసుగుప్పలో నక్సల్స్?
మావోయిస్టుల్లో కొందరు తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని పూసుగుప్ప వైపు వచ్చినట్లు కేంద్ర బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో.. ములుగు, వెంకటాపురం వైపు నుంచి ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’లో పాలుపంచుకుంటున్న సుమారు వెయ్యి మంది జవాన్లు మంగళవారం రాత్రికి పూసుగుప్పను చుట్టు ముట్టినట్లు తెలిసింది. అర్ధరాత్రి ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగవచ్చని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.