Humanitarian Judge: నిందితుల వద్దకే న్యాయమూర్తి.. ప్రజల ప్రశంసల వెల్లువ
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:50 PM
Humanitarian Judge: బోధన కోర్టులో జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు. నడివలేని స్థితిలో ఉన్న వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్, ఏప్రిల్ 29: న్యాయం కోసం బాధితులు కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కోర్టుల్లో ఎలాగైనా న్యాయం జరుగుతుందని వారు భావిస్తుంటారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతారు. బాధితులైనా, నిందితులైనా కోర్టుకు రావాల్సిందే. నేరం రుజువైతే శిక్ష పడటం ఖాయం. కానీ ఓ కేసులో నిందితులుగా ఉన్న వారి వద్దకు న్యాయమూర్తి నడిచి వస్తే.. ఇది పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఘటనే. నిజామాబాద్ జిల్లా భోదన్ కోర్టు (Bodhan Court) ప్రాంగణంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తమ కోసం స్వయంగా న్యాయమూర్తే రావడంతో ఆ నిందితులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగింది. కోర్టులో తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తి... నిందితుల వద్దకు రావడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండలం రాయకుర్కు చెందిన సాయమ్మ, గంగారాం అనే దంపతులపై కోడలు వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి తరచూ ఆ దంపతులు కోర్టు హాజరవుతుండేవారు. అదే విధంగా రెండు రోజుల క్రితం కూడా ఆ వృద్ధ జంట కేసు నిమిత్తం భోదన్ కోర్టుకు వచ్చారు. అయితే వారు నడవలేని స్థితిలో ఆటోలో కోర్టు ప్రాంగణానికి వచ్చారు. ఇక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
IPS Officers High Court: తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు
వృద్ధ దంపతులు నడవలేని స్థితిలో కోర్టుకు వచ్చిన విషయం జేఎఫ్సీఎం న్యాయమూర్తి సాయి శివ దృష్టికి వచ్చింది. దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన సదరు న్యాయమూర్తి బెంచ్ వదిలి స్వయంగా వారి వద్దకు నడుచుకుంటూ వచ్చారు. కోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తి అలా తమ ముందుకు రావడంతో ఆ వృద్ధ దంపతులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. దంపతులు వద్దకు వచ్చిన జడ్జి.. కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతా విన్న న్యాయమూర్తి బాధితుల తప్పేమీ లేదని నిర్ధారించుకుని కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఆ వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ఇలా ఉంటే తప్పకుండా న్యాయమే గెలుస్తుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా తమ వద్దకు స్వయంగా న్యాయమూర్తి రావడంతో వృద్ధ దంపతుల ఆనందం అంతా ఇంతా కాదు. తమ బాధను గుర్తించి.. తమ తప్పేమీ లేదని కేసును కొట్టివేయడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్పై మంత్రి సీతక్క రియాక్షన్
Read Latest Telangana News And Telugu News