ఆటో డ్రైవర్ మృతిపై డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:49 AM
పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు (ఎన్హెచ్ఆర్సీ) జారీ చేసింది.

సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశం
పోలీసు కస్టడీలో లాఠీ దెబ్బల వల్లే ఆటో డ్రైవర్ మరణించినట్లు ఆరోపణలు
రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఘటన
కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణ
న్యూఢిల్లీ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు (ఎన్హెచ్ఆర్సీ) జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్రమైన నివేదిక అందజేయాలని గురువారం ఆదేశించింది. ఆటో డైవ్రర్ మరణించిన అంశాన్ని మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. మీడియా కథనాల ప్రకారం... హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డైవ్రర్(35), అతని భార్యకు మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో 2025 మే 13న ఆటో డైవ్రర్ను అతని భార్య రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది.
దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆటో డైవ్రర్ను ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అతడిని రబ్బరు బెల్టుతో తీవ్రంగా కొట్టారు. గంట తర్వాత అతడిని వదిలి పెట్టగా స్టేషన్ బయటికి రాగానే వాంతులు చేసుకుంటూ కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కథనాలను పరిగణలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ విషయాన్ని డీజీపీకి జారీ చేసిన నోటీసుల్లోనూ స్పష్టం చేసింది. మీడియాలో కథనాలు నిజమైతే ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News