Share News

TG Employee Health Scheme: ఆరోగ్యానికి ఉద్యోగుల వాటా ఎంత

ABN , Publish Date - May 21 , 2025 | 04:36 AM

ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకానికి ఒక్క శాతం లేదా ఒకటిన్నర శాతం వేతనాన్ని అందించాలనే రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగ సంఘాలు మాత్రం ఒక శాతానికి మించి చెల్లించలేమని స్పష్టంచేస్తున్నాయి.

TG Employee Health Scheme: ఆరోగ్యానికి ఉద్యోగుల వాటా ఎంత

  • ఒకటా, ఒకటిన్నర శాతమా?

  • రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం

  • ‘ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం’పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

  • ఇతర రాష్ట్రాల్లోనూ అమలుపై అధ్యయనం

  • తమ వాటా ఒక శాతానికి మించి ఇవ్వలేమంటున్న ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం (న్యూఈహెచ్‌ఎ్‌స)పై ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టతకు రాలేకపోతోంది. తాజాగా దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కొత్త ఈహెచ్‌ఎ్‌సలో ఉద్యోగుల వాటా ఎంత ఉండాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొదటి ప్రతిపాదన కింద ఉద్యోగుల మూలవేతనం నుంచి ఒక శాతం తీసుకుంటారు. ఒక శాతం తీసుకుంటే ప్రతీనెలా సుమారు రూ.29.19 కోట్ల చొప్పున ఏడాదికి రూ.350 కోట్లు జమ అవుతాయి. ఈ మొత్తానికి ప్రభుత్వం మరో రూ.250 కోట్లు జమ చేస్తే... మొత్తంగా రూ.600 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రెండో ప్రతిపాదన కింద ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం తీసుకుంటే నెలకు రూ.43.79 కోట్ల చొప్పున ఏడాదికి రూ.525 కోట్లు జమవుతాయని లెక్కగట్టారు. ఈ మొత్తానికి సర్కారు రూ.75 కోట్లు జమచేస్తే రూ.600 కోట్లు అవుతాయని పేర్కొన్నారు. కాగా, 2021-22 నుంచి 2024-25 మధ్య కాలంలో మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, నగదురహిత వైద్యం కింద ప్రభుత్వం రూ.2298 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే ఏడాదికి సగటున మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.409 కోట్లు, నగదు రహిత వైద్యం కింద రూ.166 కోట్ల చొప్పున మొత్తం రూ.575 కోట్లు వెచ్చించినట్లు వైద్యఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త ఈహెచ్‌ఎస్ కింద ఏడాదికి రూ.600 కోట్లు ఖర్చుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా నిధుల సమీకరణ ఎలా చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది.


దాదాపు 6లక్షల ఉద్యోగులు, పింఛనుదార్లు

ప్రభుత్వ గణాంకాల మేరకు ఉద్యోగులు 2,67,874 మంది, పెన్షనర్లు 2,56,556మంది, పోలీసులు 70,018 మంది కలిపి మొత్తం 5,94,448మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు మరో 14,18,768 మంది ఉన్నారు. కొత్త ఈహెచ్‌ఎ్‌సపై ప్రభుత్వం వైద్యశాఖ నుంచే వివరాలు సేకరించింది. ఇంకా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదు. గతంలో ఉద్యోగ సంఘాలు తమ వాటా కింద 1 శాతం ఇస్తామని సర్కారుకు లేఖలు రాశాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌లలో ఈహెచ్‌ఎ్‌స అమలు విధానాన్ని ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఏపీలో 2016లో ఉద్యోగుల వాటా మొదలైంది. 4వ తరగతి ఉద్యోగుల నుంచి ప్రతీనెలా రూ.225, గెజిటెడ్‌ల నుంచి రూ.300 కాంట్రిబ్యూషన్‌ తీసుకుంటున్నారు. వైద్య సేవలపై పరిమితి లేదు. ప్రస్తుతం తెలంగాణలో నగదురహిత వైద్యం కింద ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుండగా, ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్‌ తీసుకోవడం లేదు.

ఒక శాతం మించి ఇవ్వలేం: ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు

ఉద్యోగుల మూల వేతనం నుంచి ఆరోగ్య పథకానికి ఎంత చెల్లిస్తారో, అంత మొత్తాన్ని సర్కారు తమ వంతు వాటా కింద చెల్లించాలి. మూల వేతనం నుంచి ఒక శాతం మాత్రమే చెల్లించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు అపరిమిత, నగదురహిత వైద్య సేవలందించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఐకేపీ, ఆశా, అంగన్వాడీ టీచర్లు, సెర్ప్‌తో పాటు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మరో 3 లక్షల మంది సైతం వాటా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. వారినీ కలుపుకోని పోవాలి. కొత్త ఈహెచ్‌ఎస్ విధివిధానాలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం.

Updated Date - May 21 , 2025 | 04:37 AM