Kavitha: రేవంత్కు మా గురించి మాట్లాడే అర్హత లేదు
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:57 AM
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె్సలో ఒక ఉద్యోగి మాత్రమే. ఆయన ముందు తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. ఆయనకు కాంగ్రెస్ అగ్రనేతల దర్శనం లభించడం లేదు.

ఆయన ముందు తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రె్సలో ఒక ఉద్యోగి మాత్రమే. ఆయన ముందు తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. ఆయనకు కాంగ్రెస్ అగ్రనేతల దర్శనం లభించడం లేదు. ఆయనకు మా గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేవైఎం నాయకుడు సాయినాథ్తో పాటు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు శనివారం తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో, ఆ తర్వాత చిట్చాట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డి లాంటి అసమర్థ సీఎంను తాను ఇంతవరకు చూడలేదని, ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఇంత బలహీనంగా లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని, ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచ సరికాదన్నారు. బీసీలకు 42ుం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. 17న మెదక్లో బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.