Opal Suchat Shungsiri: తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయ్లాండ్లో ప్రచారం చేస్తా
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:58 AM
పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ వంటి గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిందని, ఇలాంటి ప్రచారమే థాయ్లాండ్లో చేయాల్సి ఉందని మిస్ వరల్డ్-2025 ఓపల్ సుచాత షుంగ్సిరి అన్నారు.

టైటిల్ గెలిచా.. ఇక దేశమే ప్రాధాన్యం
థాయ్లాండ్లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం
పోలీసు, సైన్యంలో మగువల నియామకం కోసం ఉద్యమిస్తా
గెలుస్తానన్న నమ్మకంతోనే ‘మిస్ యూనివర్స్’ పోటీని వదిలేశా
మిస్ వరల్డ్ పోటీల్లోకి రాకుండా ఉంటే రాజకీయాల్లో ఉండేదాన్ని
‘ఆంధ్రజ్యోతి’తో మిస్ వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత షుంగ్సిరి
హైదరాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పర్యాటక ప్రాంతాలను ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ వంటి గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిందని, ఇలాంటి ప్రచారమే థాయ్లాండ్లో చేయాల్సి ఉందని మిస్ వరల్డ్-2025 ఓపల్ సుచాత షుంగ్సిరి అన్నారు. తాను కోరుకున్న టైటిల్ సొంతమైందని, ఇప్పుడు దేశమే తన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. థాయ్లాండ్లో తన సోదరీమణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసని చెప్పారు. ప్రస్తుతం మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నానని, ఇక నుంచి తన ప్రాధాన్యాలు మరింత పెరగనున్నాయని స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన వెంటనే అక్కడి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉందని తెలిపారు. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అనంతరం సుచాత తన ప్రాధాన్యాల గురించి ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు.
పర్యాటకులు అందుకే వస్తున్నారు..
దాదాపు ఏడున్నర కోట్ల జనాభా ఉన్న థాయ్లాండ్లో మహిళా హక్కుల ఉల్లంఘన నేను గమనించిన అత్యంత అమానవీయ సమస్య. ఒకవైపు అన్ని దేశాల్లో, అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడుతుండగా, మా దేశంలో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ సెక్స్ ట్రాఫికింగ్(బలవంతపు వ్యభిచారం) అతిపెద్ద సమస్య. ఉపాధి అవకాశాల్లేక మహిళలు అయిష్టంగానే ఈ వృత్తిలోకి వెళుతున్నారు. అక్కడ 15-25 అమ్మాయిల అక్రమ రవాణా కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఐక్యరాజ్య సమితితో సహా అనేక దేశాలు దీన్ని అతిపెద్ద ప్రపంచ సమస్యగా పేర్కొన్నాయి. దీంతో మహిళలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే దృష్టి పెట్టాల్సి ఉంది. బాలికలను బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు. మా దేశానికి వచ్చే పర్యాటకులు సైతం అందుకోసమే వస్తున్నారు. వారి ఆలోచన మారాల్సి ఉంది.
మా దగ్గర మహిళా పోలీసులుండరు..
హైదరాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి నేను గమనించిన కీలక విషయం పోలీసింగ్. ఇక్కడ పురుషులతో సమానంగా మహిళలున్నారు. 25 రోజులుగా నాకు భద్రతగా మహిళలే ఉండటం చాలా సంతోషం. థాయ్లాండ్లో ఇలాంటి పరిస్థితి లేదు. అక్కడ మహిళలకు సమాన హక్కులు లేవు. 1997 రాజ్యాంగంలో మహిళలకు తొలిసారి సమాన హక్కులు లభించాయి. దీనిని 2007 రాజ్యాంగంలో తిరిగి ధ్రువీకరించారు. అయినా ఇప్పటికీ పోలీసు, మిలిటరీలో మహిళలకు అవకాశం లేదు. మహిళలు అలాంటి పనులు చేయలేరన్నది ప్రభుత్వ భావన. ఇతర రంగాల్లో మహిళలు నామమాత్రంగా ఉన్నా.. అక్కడి కార్యాలయాల్లో పురుషులదే ఆధిపత్యం. భర్తల చేతుల్లో గృహ హింస ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా మహిళా సాధికారత సాధించడం అసాధ్యం. అందుకే మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు రాజ్యాంగానికే పరిమితం కాకుండా.. అమల్లోకి తేవడం కోసం ఉద్యమిస్తా.
రాజకీయాల్లో మార్పు రావాలి..
పాఠశాల రోజుల నుంచి రాజకీయాలంటే ఆసక్తి. ఈ పోటీల్లోకి రాకుంటే తప్పకుండా రాజకీయాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు రాజకీయ సంస్కరణల కోసం నా విజయాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటా. థాయ్లాండ్ పార్లమెంటులో మహిళల సంఖ్య ఐదో వంతు కూడా లేదు. మొత్తం సీట్లలో 19.4 శాతం మాత్రమే ఉన్నారు. 50 శాతానికి మించి మహిళా ప్రతినిధులు అనేక దేశాల్లో ఉన్నారు. దేశంలో అనేక మార్పులకు రాజకీయమే కీలకం. అక్కడ మహిళల సంఖ్య పెంచితే మహిళా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని నేను నమ్ముతా.
గెలుస్తానన్న నమ్మకంతోనే వచ్చా..
గత నాలుగేళ్లలో రెండుసార్లు మిస్ యూనివర్స్గా ఎంపికయ్యా. 2022లో మూడో రన్నర్పగా నిలవగా.. గతేడాది మొదటి రన్నర్పగా నిలిచా. సాధారణంగా మిస్ యూనివర్స్లో రెండుసార్లు ప్రయత్నం చేశాక మళ్లీ మిస్ వరల్డ్ కోసం ప్రయత్నించరు. అయితే రెండుసార్లు అవకాశం కోల్పోయినా.. మిస్ వరల్డ్ లాంటి గొప్ప అవకాశం సాధిస్తానన్న నమ్మకం ఉండేది. ఇందులో పాల్గొనాలంటే మిస్ యూనివర్స్ రన్నర్పగా గతేడాది లభించిన అవకాశాలన్నీ వదులుకోవాలి. అయినప్పటికీ నేను గెలుస్తానన్న నమ్మకంతోనే ఇక్కడికి వచ్చా. నా ఇంట్లో 16 పిల్లులున్నాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు వాటితో సమయం గడుపుతా. ఫైనల్కి ముందు కూడా ఒత్తిడిని వాటితోనే అధిగమించా. పోటీలో పాల్గొనే ముందు ఇంట్లోని పిల్లులతో వీడియో కాల్ మాట్లాడా. హైదరాబాద్, తెలంగాణ నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.
బాహుబలి చూసి రివ్యూ ఇస్తా..
ప్రపంచ సుందరి పోటీల ఫినాలేలో నాకెంతో ఇష్టమైన మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ను కలిశాను. అలాగే మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. పలు బాలీవుడ్ చిత్రాలను చూశాను. ఆలియా భట్ నటించిన ‘గంగూబాయీ కాఠియావాడీ’ ఎంతగానో నచ్చింది. అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించా. ‘బాహుబలి’ చిత్రం గురించి విన్నాను. కానీ చూడలేదు. పోటీలు పూర్తయ్యాక ఆ సినిమా చూడాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. మరోసారి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సినిమాపై తప్పకుండా రివ్యూ ఇస్తా. అవకాశం వస్తే బాలీవుడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధం.
అందాల భామలకు ఆత్మీయ వీడ్కోలు
విమానాశ్రయంలో సాంస్కృతిక బృందాల బై..బై..
తిరుగు ప్రయాణమైన 67 మంది సుందరాంగులు
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): 72వ మిస్వరల్డ్ అందాల పోటీల నిర్వహణ శనివారంతో ముగియడంతో పలు దేశాల సుందరీమణులు ఆదివారం తెల్లవారుజాము నుంచే తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతమంతా సందడిగా మారింది. అందాల భామలకు పర్యాటక శాఖ అధికారులు సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం హైటెక్ ్సలో జరిగిన గ్రాండ్ ఫినాలేతో పోటీలు ముగించుకుని సుమారు 67 మంది పోటీదారులు వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. మూడు వారాల పాటు సాగిన మిస్వరల్డ్ పోటీల్లో సుమారు 108 దేశాలకు చెందిన సుందరాంగులు ఉత్సాహంతో పాల్గొన్నారు. పోటీల ఆద్యంతం తెలంగాణ సాంస్కృతిక కళావైభవం ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రజల ఆదరణ, ఆతిఽథ్యం తమకు జీవితాంతం ఓ మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..