Khammam Accident: చావు అంచుల దాకా వెళ్లొచ్చారు
ABN , Publish Date - May 31 , 2025 | 04:04 AM
ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా..

కారు, డీసీఎంను ఢీకొన్న ఇనుప చువ్వల లారీ
50 అడుగుల లోతున ఉన్న నదిలోకి కారు, లారీ పల్టీ.. కారులోని కుటుంబం సురక్షితం
వైరా, మే 30 (ఆంధ్రజ్యోతి): ఇనుప చువ్వల లోడుతో వంతెనపై వెళుతున్న ఓ లారీ ఎదురుగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న డీసీఎంను, ఆ తర్వాత ఓ కారును ఢీకొట్టింది. ఈక్రమంలో లారీ, కారు వంతెనపై నుంచి 50అడుగుల లోతులో ఉన్న నదిలోకి పల్టీ కొట్టగా.. డీసీఎం రోడ్డుపైనే నిలిచినా పూర్తిగా ధ్వంసమైంది. లారీలోని ఇనుప చువ్వలు పైన పడడంతో కారు నుజ్జునుజ్జు అయింది.. ఖమ్మం జిల్లా వైరాకు సమీపంలో జాతీయ ప్రధాన రహదారిలో ఉన్న వైరా నది హైలెవల్ వంతెన వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం తీరిది. ఈ ప్రమాదాన్ని, అక్కడి భయానక వాతావరణాన్ని చూసిన వారెవరైనా సరే.. ఆయా వాహనాల్లో ఉన్నవారు చావడం ఖాయమనే అనుకుంటారు. కానీ, అలా జరగలేదు.. చావు అంచుల దాకా వెళ్లిన ఆయా వాహనాల్లో ఉన్నవారంతా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని హయత్నగర్కు చెందిన మొగిలిశెట్టి రాజశేఖర్, గీత దంపతులు, పిల్లలు తేజస్, జ్యోతి, రాజశేఖర్ తండ్రి కోటేశ్వరరావు కలిసి కారులో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు నుంచి వైరా మండలం రెబ్బవరం బయలుదేరారు. అయితే, ఖమ్మం నుంచి తల్లాడ వైపు 20ఎంఎం ఇనుప చువ్వల లోడుతో వెళుతున్న ఓ లారీ.. ఎదురుగా వస్తున్న, కొబ్బరిబొండాల లోడుతో తల్లాడ వైపు వెళుతున్న డీసీఎంను ఢీకొట్టింది. అదే క్రమంలో రాజశేఖర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీ కొంది. డీసీఎం వ్యాను వంతెన రెయిలింగ్ తగిలి నిలిచిపోగా.. లారీ, కారు 50అడుగుల లోతులో ఉన్న వైరా నదిలో పల్టీ కొట్టాయి. వైరా నదిలో మునిసిపాలిటీ డంప్ చేసిన చెత్తపై కారు పడింది. లారీలోని ఇనుప చువ్వలు కారు మీద పడగా. ఆ బరువుకు చెత్తలో కూరుకుపోయింది. కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో రాజశేఖర్ కుటుంబం సురక్షితంగా బయటపడింది. రాజశేఖర్ తండ్రికి తీవ్ర గాయాలవ్వగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్కు తీవ్రంగా గాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్